న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఎదుర్కోవడానికి విపక్షాల కూటమికి ఇంకా ఓ రూపం రావాల్సి ఉన్నది. కేసీఆర్, పలువురు ఇతర నేతలు ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. భావసారూప్యత కలిగిన పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి, ప్రతిపక్ష పార్టీల మధ్య ఐక్యతకు కొన్ని అంశాలు దోహదపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దేశవ్యాప్తంగా కులగణన, రిజర్వేషన్లపై పరిమితి ఎత్తివేత అంశాలు కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తున్నది. భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) కూడా కులగణనకు డిమాండ్ చేస్తున్నది. అయితే విపక్షాలు లేవనెత్తుతున్న ఈ డిమాండ్లపై కేంద్రంలోని బీజేపీ నోరు విప్పడం లేదు. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో బీజేపీ, దాని హిందూత్వ రాజకీయాలను ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలకు ఇవి బ్రహ్మాస్ర్తాలుగా ఉపయోగపడే అవకాశం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కేంద్రంలో బీసీలకు కనీసం ఓ మంత్రిత్వశాఖను కూడా ఏర్పాటు చేయకుండా బీజేపీ వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదన్న ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి.
విపక్షాల ఐక్య పోరాటం
ఇటీవల డీఎంకే నిర్వహించిన ఓ సదస్సులో ఆర్జేడీ నేత, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ మాట్లాడుతూ బీజేపీ మత రాజకీయాలను ఎదుర్కోవాలంటే సామాజిక న్యాయ ఆధారిత రాజకీయాలే ఉత్తమ మార్గమని పేర్కొనడం ప్రాధాన్యం సంతరించుకొన్నది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా కోలార్లో ఇటీవల మాట్లాడుతూ కులగణన నిర్వహించాల్సిందేనని, రిజర్వేషన్లపై విధించిన 50 శాతం పరిమితిని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
గొంతెత్తుతున్న పార్టీలు
కొన్ని అంశాలపై పలు విపక్ష పార్టీల మధ్య కొంతమేర విభేదాలు ఉన్నప్పటికీ, కులగణన అంశంపై దాదాపు అన్ని పార్టీలు ఏకతాటిపై ఉన్నాయి. కులగణన డిమాండ్పై కాంగ్రెస్, ఆప్ సహా అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో ఉన్నాయి. బీఆర్ఎస్, జేడీయూ, ఆర్జేడీ, ఎస్పీ, బీఎస్పీ తదితర పార్టీలు దీర్ఘకాలంగా కులగణనపై గొంతెత్తుతున్నాయి. కులగణన, రిజర్వేషన్లపై పరిమితి ఎత్తివేత డిమాండ్లు వచ్చే ఎన్నికల్లో బీజేపీని నాలుగు రోడ్ల కూడలిలో నిలబెట్టే చాన్స్ ఉన్నదని, ఈ నేపథ్యంలో బలహీన వర్గాల ప్రజల పట్ల ఆ పార్టీకి ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.