న్యూఢిల్లీ : అరుణాచల్ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ వ్యవహారం పార్లమెంట్ ఉభయసభలనూ కుదిపేస్తోంది. ఈ ఉదంతంపై సమగ్ర చర్చకు స్పీకర్ అనుమతించకపోవడంతో రాజ్యసభ నుంచి బుధవారం 17 విపక్ష పార్టీలు వాకౌట్ చేశాయి. తొలుత సభ ప్రారంభం కాగానే డిసెంబర్ 9న భారత్, చైనా సేనల ముఖాముఖిపై సవివర చర్చకు ప్రతిపక్షాలు పట్టుపట్టాయి. చర్చకు ప్రభుత్వం అనుమతించనందుకు నిరసనగా ప్రతిపక్షాలు మూకుమ్మడిగా సభ నుంచి వాకౌట్ చేశాయి.
మరోవైపు లోక్సభలోనూ తవాంగ్ సెక్టార్లో భారత్, చైనా సేనల మధ్య ఘర్షణ వ్యవహారం గందరగోళానికి దారితీసింది. సరిహద్దులో చైనా దురాక్రమణపై సమగ్ర చర్చ జరగాలని కోరుతున్నామని కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే ప్రభుత్వాన్ని నిలదీశారు. సరిహద్దులో చైనా అక్రమంగా నిర్మిస్తున్న బ్రిడ్జిలు, నివాసాలపై రక్షణ మంత్రి ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించారు. ఈ వ్యవహారంపై విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీస్తూ నినాదాలు చేయడంతో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అసహనం వ్యక్తం చేశారు.
ప్రశ్నోత్తరాలు సమయం సజావుగా సాగాలని ప్రతిపక్ష సభ్యులు కోరుకోవడం లేదా అని ప్రశ్నించారు. ప్రతిరోజూ ప్రశ్నోత్తరాల సమయంలో గందరగోళం నెలకొనడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. కాగా, భారత్-చైనా మధ్య సరిహద్దు ప్రతిష్టంభన విషయంలో చర్చకు ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోందని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ ప్రశ్నించారు. ఈ అంశంపై తాము సమగ్ర చర్చను కోరుతున్నామని తివారీ పట్టుబట్టారు.