న్యూఢిల్లీ : విపక్షాలు ఉప రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేశాయి. మార్గరెట్ అల్వాను తమ అభ్యర్థిగా బరిలో నిలిపాయి. మార్గరెట్ పేరును ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆదివారం ప్రకటించారు. గతంలో ఆమె నాలుగు రాష్ట్రాలకు గవర్నర్గా పని చేశారు. గోవా, రాజస్థాన్, ఉత్తరాఖండ్ గవర్నర్గా సేవలందించారు. ఆమె కేంద్రమంత్రిగా కూడా సేవలందించారు. ఆమె స్వస్థలం కర్నాటక. 1942 ఏప్రిల్ 14న కర్నాటక మంగళూరులో జన్మించారు. 1969లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆమె 1975, 1977 మధ్య అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సంయుక్త కార్యదర్శిగా 1978 , 1980 మధ్య కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు.
ఏప్రిల్ 1974లో మార్గరెట్ అల్వా కాంగ్రెస్ ప్రతినిధిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1980, 1986, 1992లో తిరిగి ఎన్నికయ్యారు. రాజ్యసభలో ఉన్న సమయంలో పలు స్టాండింగ్ కమిటీల్లో సేవలందించారు. 1984-85 మధ్య పలుశాఖలకు మంత్రిగాను సేవలందించారు. 1999లో ఉత్తర కన్నడ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. 2004, 2009లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసినా ఓటమిపాలయ్యారు. ఆ సమయంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ఇదిలా ఉండగా.. శనివారం అధికార ఎన్డీయే కూటమి తమ అభ్యర్థిగా జగ్దీప్ ధన్ఖఢ్ను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఖరారు చేసింది.