రైతులను చంపాలనే ముందస్తు ప్రణాళిక
లఖింపూర్ ఘటనపై సిట్ సంచలన నివేదిక
నిందితులపై తీవ్ర అభియోగాలకు సిఫారసు
అంగీకారం తెలిపిన చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్
అజయ్ మిశ్రా రాజీనామాకు విపక్షాల డిమాండ్
లఖింపూర్ ఖీరీ (యూపీ), డిసెంబర్ 14: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖీరీలో రైతులపై జరిగిన హింసాకాండ.. ముందస్తు ప్రణాళికతో కూడిన కుట్రేనని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తేల్చింది. కేంద్రమంత్రి అజయ్మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా సహా మొత్తం 13 మంది నిందితులపై దాఖలు చేసిన చార్జ్షీట్లో పలు సవరణలు చేయాలని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (సీజేఎం)కు విజ్ఞప్తి చేసింది. ఐపీసీ సెక్షన్లు 279 (ర్యాష్ డ్రైవింగ్), 338 (నిర్లక్ష్యంతో తీవ్రగాయాలు చేయడం), 304ఏ (నిర్లక్ష్యపూరిత చర్యలతో మరణానికి కారణం కావడం) వంటి సెక్షన్ల స్థానంలో.. హత్యాయత్నం, అల్లర్లు వంటి తీవ్రమైన అభియోగాలను చేర్చాలని సూచించింది. ఈ సిఫారసును సీజేఎం అంగీకరించింది. గత అక్టోబర్ 3న లఖింపూర్ ఖీరీలోని టికూనియాలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా శాంతి యుత ప్రదర్శనలు చేస్తున్న రైతుల మీదుగా ఆశిష్మిశ్రా వాహనశ్రేణి దూ సుకుపోయింది. ఈ ఘటనలో నలుగురు రైతులు మరణించారు. అనంతరం జరిగిన ఘర్షణల్లో మరో ముగ్గురితో పాటు ఒక జర్నలిస్టు మృతి చెందారు.అజయ్మిశ్రాను కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పించాలని, ఘటనకు కారణమైన ఆయన కుమారుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. నిందితులందరినీ పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తు విషయంలో అలసత్వం వహించిన యూపీ సర్కారుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం పంజాబ్-హర్యానా హైకోర్టు రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణలో సిట్ ఏర్పాటు చేసింది. తాజాగా సిట్ నివేదిక సమర్పించింది.
మోదీ క్షమాపణలు చెప్పాలి
సిట్ నివేదికపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. కేంద్రమంత్రి అజయ్మిశ్రాను పదవి నుంచి తొలగించడంతో పాటు రైతుల మరణంపై ప్రధాని నరేంద్రమోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా పదవికి రాజీనామా చేయాలని బెంగాల్ సీఎం మమత డిమాండ్ చేశారు.
సిట్ నమోదు చేయాలన్న కొత్త అభియోగాలు ఇవే
ఐపీసీ సెక్షన్లు 307 (హత్యాయత్నం), 147 (అల్లర్లు), 148 (అల్లర్లు సృష్టించి మారణాయుధాలు వాడటం), 149 (గుమిగూడి చట్టవిరుద్ధంగా నేరాలకు పాల్పడటం), 120బీ (నేరపూరిత కుట్ర), 326 (మారణాయుధాలతో ఉద్దేశపూర్వకంగా గాయపర్చడం), 34 (ఒకే ఉద్దేశంతో మూకుమ్మడిగా చర్యలు), ఆయుధాల చట్టం కింద సెక్షన్లు 3/25/30 నమోదు.
మంత్రిని అరెస్ట్ చేసేదాకా నిరసనలు: ఎస్కేఎం
లఖింపూర్ ఖీరీ హింసాకాండకు ప్రధాన సూత్రధారి అయిన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను మోదీ సర్కారు మంత్రివర్గం నుంచి తొలగించాలని సంయుక్త కిసాన్ మోర్చా డిమాండ్ చేసింది. మంత్రిని అరెస్ట్ చేసేదాకా నిరసనలు కొనసాగిస్తామని స్పష్టంచేసింది. ఈ ఘటనలో కేంద్ర మంత్రి, ఆయన కుమారుడి హస్తం ఉన్నదని తాము ముందు నుంచీ చెబుతున్నామని, సిట్ నివేదికలో కూడా అదే వెల్లడైనట్టు భారతీయ కిసాన్ యూనియన్ పేర్కొంది.