న్యూఢిల్లీ, జూలై 21: ధరలు, జీఎస్టీ పెంపునకు నిరసనగా ప్రతిపక్ష పార్టీల నిరసనలతో గురువారం కూడా పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. ఉదయం లోక్సభ సమావేశాలు ప్రారంభం కాగానే ద్రవ్యోల్బణం, జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్, డీఎంకే తదితర పార్టీ నేతలు సభలో నినాదాలు చేశారు. ఫ్లకార్డులు ప్రదర్శించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేయడంపై కాంగ్రెస్ ఎంపీలు విరుచుకుపడ్డారు.
‘సత్యమేవ జయతే’ అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. సమస్యలపై సమాధానం చెప్పకుండా కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తుండటాన్ని నిరసిస్తూ డీఎంకే నేతలు సభను వాకౌట్ చేశారు. ధరల పెరుగుదలపై విపక్షాలు చర్చకు పట్టుబట్టడంపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషీ స్పందించారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆరోగ్యం కుదటపడ్డాక అన్నింటిపై చర్చిద్దామన్నారు. అటు రాజ్యసభలోనూ ధరలు, జీఎస్టీ పెంపుపై విపక్ష నేతలు ఆందోళనలు చేపట్టారు. సభ్యుల నిరసనలు కొనసాగడంతో ఇరు సభలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి.
జడ్జీల రిటైర్మెంట్పై ప్రతిపాదన లేదు
సమావేశాల్లో భాగంగా సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రులు సమాధానమిచ్చారు. భద్రతా సమస్యల కారణంగా 2021-22లో దేశవ్యాప్తంగా 13 లక్షల ద్విచక్ర, పాసింజర్ కార్లను వెనక్కి తీసుకున్నట్టు (రీకాల్) రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ సభకు తెలిపారు. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల పదవీవిరమణ వయసుపై ఎలాంటి ప్రతిపాదనలు లేవని కేంద్రం తెలిపింది. ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో జెన్కోలు 92 లక్షల టన్నుల బొగ్గును దిగుమతి చేసుకున్నట్టు కేంద్రమంత్రి ఆర్కేసింగ్ పార్లమెంట్కు తెలిపారు.
94 యూట్యూబ్ ఛానల్స్పై నిషేధం
దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న 94 యూట్యూబ్ ఛానల్స్, 19 సోషల్ మీడియా ఖాతాలు, 747 యూఆర్ఎల్స్ను గత ఏడాది బ్యాన్ చేసినట్టు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. పత్రికా స్వేచ్ఛ సూచీలో భారత్ 150వ స్థానంలో ఉందంటూ ఇటీవల వెలువడిన ఓ నివేదికను తప్పుబట్టారు. ఆ నివేదిక పారదర్శకతలో లోపాలు ఉన్నట్టు ఆరోపించారు.