Operation Sindoor | ఆపరేషన్ సిందూర్పై చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతుందన్నారు. దేశ సైనిక సంసిద్ధత విషయంలో మన సన్నద్ధత స్థాయి చాలా ఎక్కువగా ఉండాలన్నారు. మనం 24 గంటలు.. 365 రోజులు సిద్ధంగా ఉండేలా సన్నాహాలు ఉండాలన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన రక్షణ సదస్సులో సీడీఎస్ జనరల్ చౌహాన్ మాట్లాడారు. యుద్ధ పరిస్థితుల్లో భవిష్యత్లో ఒక సైనికుడు సమాచారం, సాంకేతికతతో పాటు యోధుడిలాంటి పోరాట నైపుణ్యాలను కలిగి ఉండాలని పేర్కొన్నారు. సైన్యం ‘శాస్త్ర’ (యుద్ధం), శాస్త్ర’ (నాలెడ్జ్) రెండింటినీ నేర్చుకోవడం అవసరమన్నారు. మారుతున్న ఆధునిక యుద్ధ వ్యూహాలపై సైతం ఆయన స్పందించారు.
నేటి యుద్ధాలు సంప్రదాయ సరిహద్దులకే పరిమితం కాదని.. సాంకేతికంగా చాలా సంక్లిష్టంగా మారాయన్నారు. దీన్ని మూడో సైనిక విప్లవంగా అభివర్ణించారు. నేటి యుద్ధం ఇకపై తుపాకులు, ట్యాంకులకే పరిమితం కాదని అన్నారు. మూడు స్థాయిల యుద్ధాల్లో ప్రావీణ్యం అవసరం పేర్కొన్నారు. భూమి, నీరు, గాలితో పాటు సైబర్ వంటి కొత్త యుద్ధ భూమిలో సమర్థవంతంగా ఉండాలన్నారు. డ్రోన్, సైబర్, నరేటివ్ వార్, కంజెక్టివ్ వార్ ఫేర్, అంతరిక్షంతో అనుసంధానమైన యుగంగా పేర్కొన్నారు. ‘కన్వర్జెన్స్ వార్ఫేర్’పై స్పందిస్తూ.. కన్వర్జెన్స్ వార్ఫేర్ అనే పదాన్ని ఉపయోగిస్తూ.. నేడు కైనటిక్, నాన్-కైనటిక్ (సాంప్రదాయ-డిజిటల్) యుద్ధాలు ఒకదానితో ఒకటి విలీనం అవుతున్నాయని అన్నారు. మొదటి, రెండవతరం యుద్ధాలు.. నేడు మూడో తరం సైబర్, ఏఐ ఆధారిత యుద్ధాలతో విలీనమయ్యాయన్నారు.
‘హైబ్రిడ్ వారియర్’ భావన భవిష్యత్తులో మనకు సరిహద్దులో పోరాడగల, ఎడారిలో వ్యూహాన్ని రూపొందించగల, నగరాల్లో తిరుగుబాటు నిరోధక కార్యకలాపాలను నిర్వహించగల, డ్రోన్లను అడ్డుకునేలా, సైబర్ దాడులకు ప్రతిస్పందించగల ‘హైబ్రిడ్ వారియర్’ అవసరమని సీడీఎస్ అన్నారు. ఇప్పుడు మనకు మూడు రకాల యోధులు అవసరమని జనరల్ చౌహాన్ తెలిపారు. టెక్ వారియర్స్, ఇన్ఫో వారియర్స్, స్కాలర్ వారియర్స్ అవసరమన్నారు. రాబోయే యుద్ధాల్లో ఈ మూడు రకాల పాత్రల్లో పని చేసే నైపుణం ఉండడం తప్పనిసరని.. ఇది ఆధునిక యుద్ధానికి కొత్త నిర్వచనంగా పేర్కొన్నారు.