Operation Sindhu | ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇరాన్లో ఉన్న భారతీయులను సురక్షితంగా దేశానికి తిరిగి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఆపరేషన్ సింధు చేపట్టి భారతీయులను ఇరాన్ నుంచి తరలిస్తున్నది. ఇప్పటి వరకు 517 మంది భారత పౌరులను సురక్షితంగా తరలించినట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. ఇందులో విద్యార్థులతో పాటు ఇతర పౌరులు ఉన్నారని పేర్కొంది.
శుక్రవారం రాత్రి 11.30 గంటలకు ఇరాన్ నుంచి 290 మంది భారతీయులతో కూడిన విమానం ఢిల్లీకి చేరిందని విదేశాంగశాఖ ప్రతినిధి రణదీర్ జైస్వాల్ సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ఇందులో పెద్ద సంఖ్యలో విద్యార్థులతో పాటు ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లిన వారు, మహిళలు ఉన్నారు. వారికి విదేశాంగ మంత్రిత్వశాఖ కార్యదర్శి (సీపీవీ-వోఐఏ) అరుణ్ ఛటర్జీ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ఇరాన్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఆపరేషన్ సింధుకు సహకారం అందించారని.. ఈ కార్యక్రమంలో ఇకపై కొనసాగుతుందని పేర్కొన్నారు. శనివారం ఉదయం తుర్కెమేనిస్తాన్ రాజధాని అష్గాబాత్ నుంచి మరొక విమానం ఢిల్లీకి చేరుకుంది. ఈ విమానంతో ఆపరేషన్ సింధు కింద భారతదేశానికి తిరిగి వచ్చిన మొత్తం పౌరుల సంఖ్య 517 కి చేరుకుంది. అవసరాన్ని బట్టి ఈ ఆపరేషన్ కొనసాగుతుందని.. ఇరాన్లో చిక్కుకుపోయిన ప్రతి పౌరుడికి సహాయం అందించనున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
గురువారం మొదటి దశలో 110 మంది పౌరులతో కూడిన విమానం భారత్కు చేరిన విషయం తెలిసిందే. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తీవ్రంగానే ఉన్నాయని.. ఈ క్రమంలో భారత ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసుకుందని.. పౌరుల భద్రతకు పెద్దపీట వేసి భారతీయులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు ‘ఆపరేషన్ సింధు’ మిషన్ చేపట్టినట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. ఇరాన్ నుంచి పౌరులను తరలించడం సవాల్తో కూడుకున్న పని అని.. దీన్ని భారత ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహించిందని చెప్పింది.