ఎన్నికల ఫలితాలు దగ్గరపడుతున్న వేళ గోవా విషయంలో కాంగ్రెస్ కీలక ప్రకటన చేసింది. బీజేపీయేతర పక్షాలతో పొత్తుకు తాము సిద్ధంగానే వున్నామని కీలక ప్రకటన చేసింది. ఇన్ని రోజుల పాటు తృణమూల్, కాంగ్రెస్ ఉప్పూ నిప్పులా వుంటూ వస్తున్నాయి. సరిగ్గా మరో మూడు రోజుల్లో ఫలితాలు రాబోతున్న సమయంలో కాంగ్రెస్ చేసిన ప్రకటనకు ప్రాధాన్యం ఏర్పడింది.
కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, గోవా ఎన్నికల వ్యవహారాల ఇన్చార్జీ దినేశ్ గుండూ రావు మాట్లాడుతూ.. తమకు గనక ప్రభుత్వ ఏర్పాటుకు మెజారిటీ మార్క్ తగ్గితే.. తృణమూల్, మహారాష్ట్రవాదీ గోమంత్, ఆప్తో పొత్తుకు సిద్ధమంటూ ప్రకటించారు. తమకు గనక స్పష్టమైన మెజారిటీ వస్తే.. ఏమాత్రం సమయం వృథా కానివ్వమని, వెంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అలాగే శాసనసభా పక్ష నాయకుడ్ని ఎన్నుకోవడంలో కూడా అస్సలు సమయాన్ని వృథా చేయమని దినేశ్ గుండూ రావు ప్రకటించారు. అయితే ఆప్, తృణమూల్ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.
ఎన్నికల ప్రచారంలో విమర్శలు త్రిముఖంగా సాగాయి. కాంగ్రెస్, ఆప్, తృణమూల్ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ముఖ్యంగా ఈ విమర్శలు తృణమూల్ వర్సెస్ కాంగ్రెస్గానే సాగాయి. కాంగ్రెస్ వైఫల్యం వల్లే బీజేపీ పెరుగుతోందంటూ, రాచరికపు లక్షణాలను కాంగ్రెస్ విడనాడాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగానే మండిపడ్డారు. తాము కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకోమని కూడా ప్రకటించారు. తీరా… ఫలితాల సమయం దగ్గరపడుతున్న వేళ… కాంగ్రెస్ చేసిన ప్రకటనకు ప్రాధాన్యం ఏర్పడింది.