Ayodhya Ram Mandir | లక్నో, డిసెంబర్ 25: అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవాన్ని కనులారా వీక్షించాలని కోరుకుంటున్న సామాన్యుల ఆశలపై యోగి సర్కార్ నీళ్లు చల్లుతున్నది. బడా వ్యాపారులు, రాజకీయవేత్తలు, సినీ నటులు, సాధువులు.. అత్యంత ప్రముఖుల (వీవీఐపీ)కు మాత్రమే అక్కడి హోటల్స్ గదులు కేటాయిస్తున్నాయని విమర్శలు వెల్లువెత్తాయి. రాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి సంబంధించి అధికారిక అనుమతి ఉంటేనే హోటల్స్లోకి రానివ్వాలని, లేదంటే వారి బుకింగ్స్ వెంటనే రద్దు చేయాలని నగరంలోని హోటల్ యజమానులకు యోగి సర్కార్ నుంచి తాఖీదులు అందినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ‘సీఎం యోగి ఉన్నతాధికారులతో కొద్ది రోజుల క్రితం సమీక్ష నిర్వహించారు. వీలైనన్ని హోటల్ గదులు వీవీఐపీలకు అందుబాటులో ఉండేలా అధికారులకు సీఎం యోగి సూచించారు’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ప్రభుత్వ అధికారి మీడియాకు తెలిపారు.
బుకింగ్స్ రద్దు లేదా వాయిదా
సాధారణ యాత్రికుల రూమ్ బుకింగ్స్ను రామాయణ, క్రినోస్కో హోటల్, సిజినెట్ కలెక్షన్, కేకే హోటల్, పార్క్ ఇన్ బై రాడిసన్.. మొదలైన ప్రఖ్యాత హోటల్స్ రద్దు చేస్తున్నాయని, లేదంటే వాటిని వేరే తేదీకి వాయిదా వేస్తున్నాయని వార్తలు వెలువడ్డాయి. ‘మా హోటల్లోని 60 గదులు ప్రభుత్వమే తీసుకుంది. ఇప్పటివరకు 10 బుకింగ్స్ రద్దు చేశాం. మరికొన్నింటిని రద్దు చేయనున్నాం’ అని క్రినోస్కో హోటల్ ఉద్యోగి ఒకరు చెప్పారు. బుకింగ్స్ను రద్దు చేయటం కాకుండా మరో రోజుకు మార్చుతున్నామని కేకే హోటల్ తెలిపింది. జనవరి 22న నగరానికి వచ్చినా.. దర్శనానికి అనుమతి ఉండదని యాత్రికులకు చెబుతున్నామని ప్రముఖ హోటల్ మేనేజర్ తెలిపాడు. అయితే సాధారణ భక్తుల హోటల్ బుకింగ్స్ రద్దు చేస్తున్నారన్న వార్తల్ని అయోధ్య మున్సిపల్ కమిషనర్ విశాల్ శర్మ ఖండించారు. భద్రతా పరమైన ఏర్పాట్లలో భాగంగానే ఇదంతా చేస్తున్నామని చెప్పారు.
హోటల్ గదుల ధరలు రూ.లక్షల్లో
రామమందిర ప్రారంభోత్సవం సమీపిస్తుండటంతో అయోధ్యలో హోటల్ గదుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో, అక్కడి హోటల్ నిర్వాహకులు భారీగా రేట్లు పెంచేశారు. కొన్ని చోట్ల హోటల్ గదుల ధరలు రూ.లక్షకు చేరుకున్నాయి. మరోవైపు రామ మందిరానికి సమీపంలో విలాసవంతమైన గుడారాలను భక్తుల కోసం ఏర్పాటుచేశారు. ‘టెంట్ సిటీ’ పేరుతో నిర్మించిన ఈ గుడారాల్లో 5 నక్షత్రాల హోటల్స్కు ఏమాత్రం తీసిపోకుండా వసతి సౌకర్యాలున్నాయట.