న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేదు అనుభవం ఎదురైంది. ప్రస్తుతం ఎన్నికల ఫలితాలపై ఆ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకుంటున్నది. ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగనున్నది. భేటీలో పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తన పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతున్నది. సీనియర్ నేతలు సోనియా రాజీనామాపై ఏకాభిప్రాయం కుదిరితే.. కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, ముకుల్ వాస్నిక్ ఇద్దరిలో ఎవరో ఒకరిని ప్రస్తుతానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.
అలాగే, ఉత్తరప్రదేశ్లో గతంలో ఎన్నడూ లేని విధంగా దారుణమైన ఫలితాలను చవిచూసింది. ఈ క్రమంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ సైతం తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా పరాజయం పాలవుతుండడంతో సర్వత్రా పార్టీ అధినాయకత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ నాయకత్వంతో పాటు విధానాలు, వ్యూహాలు, కార్యాచరణపై ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.
ఈ క్రమంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ ఇవాళ సాయంత్రం 4 గంటలకు వర్కింగ్ కమిటీ అత్యవసర సమావేశానికి ఏర్పాటు చేసింది. భేటీకి ముందే సోనియా తాత్కాలిక అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. సోనియా రాజీనామాను సీనియర్ నేతలు కోరుకోవడం లేదని, పలువురు సీనియర్ కాంగ్రెస్ ఆఫీస్ బేరర్లు సైతం రాజీనామాను అంగీకరించడం లేదని పార్టీ నేతలు చెబుతున్నారు.
ఎందుకంటే మరికొద్ది నెలల్లో పార్టీకి పూర్తిస్థాయి అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. అయితే, హైకమాండే తాత్కాలిక అధ్యక్షుడి మల్లికార్జున ఖర్గే లేదంటే ముకుల్ వాస్నిక్ను నియమించాలని చర్చ జరుగుతుందని గాంధీ కుటుంబానికి చెందిన సీనియర్ నేత ఒకరు చెప్పారు. ఇవాళ్టి భేటీలో సోనియా రాజీనామాను ఆమోదిస్తే పూర్తిస్థాయి అధ్యక్షుడిని ఎన్నుకునే వరకు ఖర్గే లేదంటే వాస్నిక్కు పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
భేటీలో జాతీయ ప్రధాన కార్యదర్శి పదవికి ప్రియాంక గాంధీ సైతం రాజీనామా చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంక కీలకంగా వ్యవహరించారు. యూపీ ఎన్నికల్లో ముందుండి ప్రచారం నిర్వహించారు. అయినా.. ఆమె వ్యూహాలు ఎక్కడా నిలువలేదు. పోగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యంత దారుణస్థితికి కాంగ్రెస్ పడిపోయిందని పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల్లో ప్రియాంక వ్యూహంపై, టికెట్ల పంపిణీపై ఓ వర్గం నేతలు విమర్శలు గుప్పించడంతో పాటు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రియాంక సైతం రాజీనామా చేసే అవకాశం ఉందని తెలుస్తున్నది. వాస్తవానికి ప్రియాంక యూపీ ఎన్నికల్లో తీవ్రంగానే కష్టపడి ప్రచారం నిర్వహించారు. కానీ, ఫలితాలు మాత్రం తీవ్రంగా నిరాశ పరిచాయి.
మరికొద్ది రోజుల్లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఆ తర్వాత 2023లో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ తరుణంలో పార్టీ వైఖరి మారకుంటే ఉనికే ప్రశ్నార్థకమవుతుందని పలువురు సీనియర్ నేతలు పేర్కొంటున్నారు. 2024 లోక్సభ ఎన్నికలు, ఈలోగా జరగనున్న వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2027లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు, 2029 లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీని బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని నేతలు పేర్కొంటున్నారు.