శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని బుద్గాంలో (Budgam) ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. బుద్గాంలోని జోల్వా క్రాల్పోరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. ఈ సందర్భంగా గాలింపు బృందాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ప్రతిగా భద్రతా బలగాలు జరిపిన ఎదురు క్లాపుల్పుల్లో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. చనిపోయిన ఉగ్రవాదులు ఏ సంస్థకు చెందినవారనే విషయం ఇంకా తెలియరాలేదని వెల్లడించారు. ఘటనా స్థలంలో మందుగుండు సామాగ్రి, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
ఈనెల 5న పుల్వామాలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు జైషే మహమ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. వారిలో ఒకరు పాకిస్థాన్ జాతీయుడు ఉన్నారు.