ఏ పార్టీలోనైనా కోటరీలు, గ్రూపులు, తగాదాలు, ఒకరిపై ఒకరు పైచేయి సాధించడాలు…. ఇవన్నీ సర్వ సాధారణం. కాంగ్రెస్లో ఈ పాలు ఎక్కువే. చాలా సంవత్సరాల పాటు కాంగ్రెస్లో సోనియా గాంధీ కోటరీ బలంగా నడిచింది. ఇప్పటికీ నడుస్తోంది కానీ… మధ్యలో రాహుల్ కోటరి అంటూ ఒకటి తయారైంది. యువ నేతలందరూ రాహుల్ చుట్టూ తిరిగేలా ఈ కోటరీ చేస్తోంది.
కానీ.. రానూ రానూ రాహుల్ కోటరీ విమర్శల జడివానలో ఇరుక్కుంటోంది. అసంతృప్తులందరూ రాహుల్ కోటరీనే లక్ష్యంగా చేసుకుంటూ విమర్శలు చేస్తున్నారు. పార్టీని వీడుతున్నారు. అసంతృప్తులు గానీ, పార్టీ నుంచి నిష్క్రమించిన వారుగానీ చేసే విమర్శ ఒక్కటే. రాహుల్ మంచోడే. ఆయన చుట్టూ వుండే కోటరీయే డేంజర్. వీళ్లు తెలిసో, తెలియకో.. రాహుల్ రాజకీయ భవితవ్యంతో ఫుట్బాల్ ఆడుతున్నారని అంటున్నారు.
జ్యోతిరాదిత్య సింధియా, జితిన్ ప్రసాద, ఆర్పీఎన్ సింగ్, అల్పేశ్ ఠాకూర్, జిగ్నేశ్ మేవానీ, హార్థిక్ పటేల్… ఇలా.. రాహుల్ కోటరీ అంటూ వుండేది. ఇప్పుడు ఒక్కొక్కరుగా నిష్క్రమిస్తున్నారు. సింధియా, జితిన్ ప్రసాద, ఆర్పీఎన్ సింగ్ ఎప్పుడో నిష్క్రమించారు. తాజాగా.. హార్థిక్ పటేల్ కాంగ్రెస్కు గుడ్ బై చెప్పేశారు.
వీరందర్నీ రాహుల్ ఏరి కోరి తీసుకున్నారు. రాహుల్ కనుసన్నల్లోనే వీరందరూ తిరిగారు. ఆయనతోనే లంచ్లు చేయడం, డిన్నర్లు చేయడం, సమావేశాల్లో పాల్గొనడం లాంటివి చేశారు. ఇంతలా రాహుల్తో కలియతిరిగిన వీరిలో ఇప్పుడు సగం మంది రాహుల్ను విడిచేసి వెళ్లిపోయారు. వీరందరూ అనే కామన్ పాయింట్ ఒక్కటే.. రాహుల్ మంచోడే.. ఆయన కోటరీయే డేంజర్ అని అంటున్నారు.
అయితే.. గతంలో హిమంత విశ్వశర్మ రాహుల్ పై ఎలాంటి విమర్శలు చేశారో… హార్థిక్ పటేల్ కూడా అచ్చు అవే విమర్శలు చేసి వెళ్లిపోయారు. రాహుల్కు నేతల కన్నా.. తన పెంపుడు కుక్కను చూడడం, దానికి ఫీడింగ్ చేయడంపైనే ఎక్కువ శ్రద్ధ చూపుతారని, అసలు తనను పట్టించుకోలేదని హిమంత విశ్వశర్మ విరుచుకుపడ్డ విషయం తెలిసిందే.
హార్థిక్ పటేల్ కూడా పోతూ పోతూ కాంగ్రెస్ హైకమాండ్ పై తీవ్ర విమర్శలే చేశారు. చాలా మంది అగ్రనేతలను కలవడానికి వెళ్లా. నాతో మాట్లాడటం కంటే వారి వారి ఫోన్లపైనే వారికి ధ్యాస ఎక్కువ. ఎదుటి వారి మాటలు వింటే ఒట్టు. ఇతర విషయాలపై కూడా మమకారం ఎక్కువే. స్యాండ్విచ్, చికెన్ స్యాండ్విచ్ తినడం, తెప్పించుకోవడంపైనే ఆసక్తి చూపుతారు. పార్టీ క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు మా నేత విదేశాల్లో ఉన్నారు అంటూ రాహుల్పై పరోక్షంగా విరుచుకుపడ్డారు.
జ్యోతిరాదిత్య అయినా, ఆర్పీఎన్ సింగ్ అయినా, జితిన్ ప్రసాద అయినా… వీరందరికీ ఒకటే ఝలక్. రాహుల్ కోటరీయే వీరందరికీ పెద్ద ఝలక్ ఇచ్చింది. నేరుగా రాహుల్తో వీరికి ఏర్పడ్డ తగాదా ఏమీ లేదు. నేరుగా తాము రాహుల్నే కలుస్తామంటే మధ్యలో పుల్లలు వేసేస్తారని, చాడీలు చెప్పి, ఆయన్ను కలవనీయరని ఆరోపిస్తున్నారు. ఆ కోటరీకి తెలిసో, తెలియకో.. రాహుల్ గాంధీ రాజకీయ భవితవ్యాన్ని నాశనం చేసేస్తున్నారని మండిపడుతున్నారు. హార్థిక్ పటేల్ నిష్క్రమిస్తూ… ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.