న్యూఢిల్లీ: ఒక మిస్డ్ ఫోన్ కాల్ (Missed Call) ఆధారంగా బాలిక మర్డర్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 9న నాంగ్లోయ్ ప్రాంతానికి చెందిన 11 ఏళ్ల బాలిక ఉదయం 7.30 గంటలకు ఒంటరిగా బస్సులో స్కూల్కు వెళ్లింది. సాయంత్రం దాటినప్పటికీ ఆమె ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు అంతటా వెతకడంతోపాటు ఆరా తీశారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమార్తెను కిడ్నాప్ చేసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఆ రోజు ఉదయం 11.50 గంటలకు తన మొబైల్ ఫోన్కు ఒక మిస్డ్ కాల్ వచ్చిందని బాలిక తల్లి పోలీసులకు తెలిపింది. ఆ నంబర్కు తాను తిరిగి కాల్ చేయగా ఫోన్ స్విచ్ఛాఫ్గా వచ్చిందని చెప్పింది. తమకు నలుగురు పిల్లలని, ఆమె ఒక్కతే కూతురని వెల్లడించింది.
కాగా, బాలికను కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానించిన పోలీసులు ఆ మేరకు కేసు నమోదు చేశారు. బాలిక తల్లి మొబైల్ ఫోన్కు వచ్చి మిస్డ్ కాల్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఆ మొబైల్ నంబర్ను ట్రేస్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పంజాబ్, మధ్యప్రదేశ్లో కూడా రైడ్లు చేశారు. చివరకు ఈ నెల 21న నిందితుడు రోహిత్ అలియాస్ వినోద్ను పోలీసులు అరెస్ట్ చేశారు. 21 ఏళ్ల అతడ్ని ప్రశ్నించగా మాయమాటలతో ఆ బాలికను కిడ్నాప్ చేసినట్లు తెలిపాడు. ముండ్కా గ్రామంలోని ఘేవ్రా మోర్ ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేసి మృతదేహాన్ని అక్కడ పడేసినట్లు చెప్పాడు.
దీంతో పోలీసులు బాలిక మృతదేహాన్ని ఆ ప్రాంతంలో గుర్తించారు. క్లూస్టీమ్ను రప్పించి ఆధారాలు సేకరించారు. బాలిక మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఆమెపై లైంగిక దాడి జరిగిందా లేదా అన్నది పోస్ట్మార్టం రిపోర్ట్లో తెలుస్తుందన్నారు. ఆ బాలికను నిందితుడు ఎందుకు హత్య చేశాడు అన్న దానిపై అతడ్ని ప్రశ్నిస్తున్నామని వివరించారు. బాలిక తల్లి మొబైల్ ఫోన్కు మిస్డ్ కాల్ రాకపోతే ఈ కేసు మిస్టరీని ఛేదించడం చాలా కష్టంగా మారేందని పోలీస్ అధికారి వెల్లడించారు.