నాసిక్: మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోగల ఒక కెమికల్ ఫ్యాక్టరీలో ఇవాళ ఉదయం 11 గంటలకు బాయిలర్ పేలింది. దాంతో పలువురు కార్మికులు మంటల్లో చిక్కుకున్నారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు.
మంటలను ఆర్పేసి కార్మికులను రక్షించారు.
ఈ ఘటనలో ఒక కార్మికుడి మృతదేహం లభ్యమైంది. మరో 14 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఫ్యాక్టరీలో పేలుడు జరిగిన శబ్దం తమ ఊళ్లోవరకు వినిపించిందని సమీప గ్రామస్తులు తెలిపారు. ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే స్పందించారు.
పేలుడు ఘటన బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని సీఎం షిండే చెప్పారు. నాసిక్ జిల్లా ఉన్నతాధికారులంతా ఘటనా ప్రాంతానికి వెళ్లి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. గాయపడిన వారి వైద్య ఖర్చులను పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. వారికి ఆర్థిక సాయం కూడా అందుతుందని హామీ ఇచ్చారు.