న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేసింది. ప్రస్తుతం కొన్ని దేశాలు ఆ మహమ్మారి బారి నుంచి విముక్తి పొందినా.. ఇంకొన్ని దేశాలు ఇప్పటికీ అల్లాడుతున్నాయి. అయితే, భారత్లో మాత్రం కరోనా మహమ్మారి ప్రభావం దాదాపు తగ్గింది. కానీ ప్రజల జీవనశైలిలో, ఆలోచనా విధానాల్లో మాత్రం ఈ మహమ్మారివల్ల భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న సమయంలో పలు కంపెనీలు తమ ఉద్యోగులతో ఇంటి నుంచే పనులు చేయించుకున్నాయి. ఇప్పుడు ప్రభావం తగ్గడంతో ఆఫీసులకు పిలుస్తున్నాయి. ఈ క్రమంలో డింగ్ గ్లోబల్ ప్రీపెయిడ్ ఇండెక్స్ (జీపీఐ) సంస్థ చేసిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.
తాజా సర్వే ప్రకారం.. భారత్లోని ప్రతి ముగ్గురు వ్యక్తుల్లో ఒకరికి కొవిడ్ ప్రభావం తగ్గిన తర్వాత కూడా తిరిగి ఆఫీసులకు వెళ్లాలని లేదని తేలింది. దాదాపు 32 శాతం మంది ఇప్పటికీ ఇంటి నుంచి పనిచేయడానికే మొగ్గు చూపుతున్నారు. కేవలం 12 శాతం మంది మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్కు స్వస్తి పలికి తిరిగి ఆఫీసులకు వెళ్లేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏందంటే.. సర్వేలో పాల్గొన్నవారిలో 39 శాతం మంది ఒకవైపు ఆఫీసులకు వెళ్లి విధులు నిర్వహించేందుకు సిద్ధమంటూనే.. ఆఫీసు నుంచి పని వారంలో కొద్దిరోజులు మాత్రమే ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
ఇంకో విషయం ఇంటరెస్టింగ్ విషయం ఏమిటంటే.. కరోనా వైరస్ ఇంత ప్రభావం చూపినా భారతీయుల్లో 52 శాతం మంది తమ ఆర్థిక పరిస్థితిపట్ల సంతృప్తిగా ఉన్నారట. ప్రపంచ సగటు కంటే ఇది చాలా ఎక్కువ. కుటుంబ ఆదాయం, ఉద్యోగ పరిస్థితులపై పాజిటివ్ దృక్పథం విషయంలో కూడా ప్రపంచ సగటుతో పోల్చితే భారతీయులు మెరుగ్గా ఉన్నారట. డింగ్ గ్లోబల్ ప్రీపెయిడ్ ఇండెక్స్ అనేది ప్రీ పెయిడ్ మార్కెట్లను విశ్లేషిస్తూ రెండేండ్లకోసారి సర్వేచేసే సంస్థ. తాజా సర్వే కోసం ఈ సంస్థ యూరప్, ఆసియా, అమెరికా దేశాలకు చెందిన 6,250 మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది.