షిమ్లా: మరికాసేపట్లో హిమాచల్ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సమావేశం కానుంది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలతో పార్టీ ముఖ్య నేతలు సమావేశమై సీఎం ఎవరనే విషయాన్ని ఖరారు చేయనున్నారు. షిమ్లాలోని రాడిసన్ హోటల్లో ఈ సమావేశం జరగనుంది. హిమాచల్ప్రదేశ్ కాంగ్రెస్ ఇన్చార్జి రాజీవ్ శుక్లా, ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బఘేల్, సీనియర్ కాంగ్రెస్ లీడర్ భూపిందర్ హుడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
తాజా ఎన్నికల్లో అధికార బీజేపీని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికార చేపట్టేందుకు సిద్ధమైంది. అయితే, సీఎం పదవికి గట్టి పోటీ నెలకొన్నది. పలువురు నేతలు సీఎం పదవిని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేతల మధ్య సయోధ్య కుదిర్చి, సీఎం పేరును ఖరారు చేయడం పార్టీ బాధ్యులకు కత్తిమీద సాములా మారింది.
హిమాచల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ సీఎం వీరభద్రసింగ్ సతీమణి ప్రతిభా వీరభద్ర సింగ్ సీఎం రేసులో ముందు వరుసలో ఉన్నారు. ప్రస్తుతం మండి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె.. ఈ ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయలేదు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం ఆమె అద్భుతంగా ప్రచారం నిర్వహించారు.
హిమాచల్ ప్రదేశ్లో వీరభద్రసింగ్ గొప్ప నాయకుడు. గత ఏడాది మరణించే వరకు కూడా ఆయన పార్టీ కోసం అహర్నిశలు శ్రమించారు. దాంతో ఆయన అభిమానులు అంతా ఇప్పుడు ప్రతిభా సింగ్ సీఎం కావాలని కోరుకుంటారు. ఆమెతోపాటు మరో ముగ్గురు కీలక నేతలు కూడా సీఎం పదవిని ఆశిస్తున్నారు.
హిమాచల్ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు సుఖ్విందర్ సింగ్ సుఖు, మాజీ సీఎల్పీ నేత ముఖేశ్ అగ్నిహోత్రి, మరో నేత హర్షవర్దన్ చౌహాన్ సీఎం పదవి కోసం ఆశపడుతున్నారు. ఈ నేపథ్యంలో సందట్లో సడేమియా అన్నట్లుగా బీజేపీ నేతలు అపరేషన్ లోటస్ పేరుతో నలుగురిలో ఎవరినైనా తమ వైపు తిప్పికుంటారేమోనని కాంగ్రెస్ శ్రేణులు భయపడుతున్నాయి.
ఈ నలుగురే కాక, మరి కొందరు నేతలు కూడా సీఎం పదవిని ఆశిస్తున్నారు. అయితే, వారికి పార్టీలో అంతగా పట్టులేదు. కాబట్టి వారి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకోవడం లేదు. కేవలం ఈ నలుగురు ప్రధాన నాయకుల మధ్య మాత్రమే సయోధ్య కుదిర్చగలిగితే.. సీఎం ఎంపిక సునాయాసం అయినట్లేనని పార్టీ ఇన్చార్జి రాజీవ్ శుక్లా చెబుతున్నారు.