న్యూఢిల్లీ, డిసెంబర్ 12: భారత్, చైనా సరిహద్దులో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అరుణాచల్ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్ వాస్తవాధీన రేఖ వద్ద ఈ నెల 9న ఇరుదేశాల బలగాల మధ్య ఘర్షణ చోటుచేసుకొన్నది. భౌతిక దాడుల వల్ల ఈ ఘటనలో ఇరు దేశాల సైనికులకు గాయాలైనట్టు సమాచారం. వాస్తవాధీన రేఖ నుంచి చైనా సైనికులు భారత్లోకి చొచ్చుకొని రావటంతో ఘర్షణలు జరిగినట్టు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. అయితే, ఎలాంటి మరణాలు సంభవించలేదని తెలిపాయి. ఘర్షణ నేపథ్యంలో శాంతి వాతావరణాన్ని నెలకొల్పేందుకు సైనికాధికారులు ఫ్లాగ్ మీటింగ్ నిర్వహించి, ఇరు దేశాల సైన్యాలను వెనక్కి రప్పించినట్టు తెలిసింది. గతంలోనూ ఈ ప్రాంతంలో ఇరు బలగాల మధ్య ఘర్షణలు జరిగాయి. 2006 నుంచి చిన్నపాటి ఘర్షణలు చోటుచేసుకొంటూనే ఉన్నాయి. గత ఏడాది అక్టోబర్లో 17 వేల అడుగుల ఎత్తులో ఉన్న పర్వతంపైకి వచ్చేందుకు చైనా బలగాలు ప్రయత్నించగా, భారత సైనికులు వారిని అడ్డగించారు.ఘర్షణలో ఎంతమంది సైనికులు పాల్గొన్నారన్నది ఆర్మీ వెల్లడించలేదు. అయితే, 200లకు పైగా చైనా సైనికులు పాల్గొన్నట్టు సమాచారం. వారు కర్రలు, ఇతర ఆయుధాలతో దాడికి పాల్పడినట్టు తెలిసింది. క్షతగాత్రులు కూడా చైనావైపే ఎక్కువగా ఉన్నట్టు సమాచారం.
2020 గల్వాన్ ఘటన తర్వాత భారత్, చైనా సైనికుల మధ్య భౌతిక దాడులు జరగటం మాత్రం ఇదే తొలిసారి. గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో తెలంగాణకు చెందిన కర్నల్ సంతోష్బాబుతో సహా 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. దాదాపు 40 మంది చైనా సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయినట్టు వెల్లడైంది. ఘటనతో రెండు దేశాల సరిహద్దుల వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. సైనికాధికారులు పలు దఫాల్లో చర్చలు జరిపి, బలగాలను వెనక్కి పిలిపించుకొన్నాయి.
నావికాదళంలో మహిళలకు ఉన్నత పదవులు కట్టబెట్టేందుకు భారత నేవీ కీలక నిర్ణయం తీసుకొన్నది. మెరైన్ కమెండోస్ (మార్కోస్)గా నియమించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. త్రివిధ దళాల్లో కమెండోలుగా విధులు నిర్వర్తించేందుకు మహిళలకు అవకాశం కల్పిస్తున్నామని, మార్కోస్గా వారిని చేర్చుకొంటామని నేవీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. భారత సైనిక చరిత్రలోనే ఇది తొలిసారి అని వెల్లడించారు. అయితే, ఇందులో చేరటానికి అర్హతలు, శిక్షణ పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నుంచి అగ్నివీర్ ద్వారా సర్వీసుల్లో చేరే వారికి అవకాశం ఉంటుందని వివరించారు. శత్రు యుద్ధ నౌకలపై కోవర్టు ఆపరేషన్ తదితర సున్నిత టాస్క్లను మార్కోస్ నిర్వహిస్తారు. తాజాగా, నేవీలో చేరేందుకు 3 వేల మంది అగ్నివీరులు ఎంపిక కాగా, అందులో 341 మంది మహిళలు ఉన్నారు. ఇప్పటి వరకు మహిళలను 7, 8 శాఖలకే పరిమితం చేయగా, ఇక నుంచి అన్ని శాఖల్లో మహిళా అధికారులను నియమిస్తామని గతంలో చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ పేర్కొన్నారు.