Rahul Gandhi | పరువు నష్టం కేసులో రెండేండ్ల జైలుశిక్ష పడిన కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్గాంధీపై లోక్సభ అనర్హత వేటుపై ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్పందించారు. తమ నేతకు అన్యాయం జరిగిందన్న విషయాన్ని క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ పెద్దగా సన్నద్ధమైనట్లు కనిపించడం లేదన్నారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు విషయంలో అధికార బీజేపీ పెద్ద మనస్సు చూపాలని బీహార్లో జన సురాజ్ యాత్రలో ప్రశాంత్ కిశోర్ అన్నారు. ఈ కేసులో రాహుల్ గాంధీకి కోర్టు విధించిన రెండేండ్ల జైలుశిక్ష చాలా ఎక్కువేనన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి తన వ్యతిరేక అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన లేదని ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఆవేశపూరితంగా ట్వీట్లు, పార్లమెంట్కు ప్రదర్శనలతో రాజకీయ పోరాటం చేయలేం అని ఆ పార్టీ అధి నాయకత్వం గుర్తించాలని హితవు చెప్పారు. దేశానికి జరుగుతున్న అన్యాయంపై ప్రజలతో మమేకమై వివరించేందుకు యత్నిస్తున్న ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కూడా కనిపించలేదన్నారు. ఈ రాజకీయ పార్టీ అయినా గ్రామస్థాయిలో పటిష్టమైతే తప్ప బీజేపీని ఓడించలేమని గ్రహించాలని స్పష్టం చేశారు.
`సంకుచిత మనస్తత్వంతో ఎవరూ గొప్పవారు కాలేరు అన్న మాజీ ప్రధాని వాజపేయి మాటలు గుర్తు చేసుకోవాలి. రాహుల్పై అనర్హత వేటు విషయమై అధికార పక్షం తొందరపడకుండా ఉండాల్సింది. కోర్టు తీర్పుపై అప్పీల్ చేశాక అక్కడ అనుకూల ఫలితం రాకుంటే చర్యలు తీసుకోవాల్సింది. నేను న్యాయ నిపుణుడ్ని కాదు. అయితే, పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి రెండేండ్ల జైలుశిక్ష చాలా ఎక్కువ. ఎన్నికల ప్రచారంలో నేతలు ఏవేవో మాట్లాడుతారు. ఇది మొదటిదీ కాదు చివరిదీ కాదు. నిబంధనల ప్రకారమే రాహుల్గాంధీపై అనర్హత వేటు వేశాం అని అధికార పక్షం చెప్పవచ్చు. కానీ, కేంద్రంలో అధికారంలో ఉన్నందున బీజేపీ సర్కార్పై పెద్ద మనస్సు చూపాల్సిన బాధ్యత ఉంది` అని ప్రశాంత కిశోర్ పేర్కొన్నారు.