జైపూర్: అంగన్వాడీ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించిన నేతలు, అధికారులు 20 మంది మహిళలపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. (20 women gang raped) బాధిత మహిళల ఫిర్యాదు మేరకు మున్సిపల్ కౌన్సిల్ చైర్పర్సన్, మాజీ మున్సిపల్ కమిషనర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. రాజస్థాన్లోని సిరోహిలో ఈ సంఘటన జరిగింది. పాలీ జిల్లాకు చెందిన ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంగన్వాడీ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి తనతోసహా సుమారు 20 మంది మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించింది.
కాగా, కొన్ని నెలల కిందట కొందరు మహిళలతో కలిసి తాను సిరోహికి వెళ్లినట్లు పోలీసులకు ఆమె తెలిపింది. మున్సిపల్ కౌన్సిల్ చైర్పర్సన్ మహేంద్ర మేవాడా, మాజీ మున్సిపల్ కమిషనర్ మహేంద్ర చౌదరిని తాము కలిసినట్లు చెప్పింది. వారు తమకు వసతి, భోజనం ఏర్పాటు చేశారని తెలిపింది. తమకు ఇచ్చిన భోజనంలో మత్తు మందు కలిపారని, అది తిన్న తర్వాత మత్తుతో ఉన్న తమపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించింది. దానిని వీడియో తీసి తమను బెదిరించారని, పలుమార్లు లొంగదీసుకోవడంతోపాటు, డబ్బులు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులో ఆ మహిళ పేర్కొంది.
మరోవైపు ఆ మహిళలు గతంలో తప్పుడు ఫిర్యాదు చేశారని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) పరాస్ చౌదరి తెలిపారు. అయితే ప్రస్తుతం ఎనిమిది మంది మహిళల పిటిషన్పై కేసు నమోదు చేయాలని రాజస్థాన్ హైకోర్టు ఆదేశించిందని చెప్పారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కౌన్సిల్ చైర్పర్సన్ మహేంద్ర మేవాడా, మాజీ మున్సిపల్ కమిషనర్ మహేంద్ర చౌదరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు వెల్లడించారు.