ముంబై, మే 14: దేశంలో నరేంద్ర మోదీ హవా ముగిసిందని శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ ఆదివారం ముంబైలో జరిగిన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఇప్పుడిక తమ (విపక్షాలు) ప్రభావం మొదలైందన్నారు. ‘కర్ణాటక ఎన్నికలు దేశానికి కొత్త దారి చూపాయి. నియంతృత్వం ఓడిపోతుందని కర్ణాటక ఓటర్లు నిరూపించారు. మేం వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం’ అని రౌత్ అన్నారు. కర్ణాటక ఎన్నికల్లో బజరంగబలి ప్రజల తరఫున పని చేశారని బీజేపీకి చురకలంటించారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే అల్లర్లు జరుగుతాయని బీజేపీ అగ్ర నేత అమిత్ షా బెదిరించారని, కానీ బీజేపీ ఓడిన తర్వాత కూడా కన్నడ సీమ ప్రశాంతంగా సంబురాలు చేసుకుందని తెలిపారు. తాజా ఎన్నికల్లో కర్ణాటకలో జరిగిందే 2024 లోక్సభ ఎన్నికల్లో పునరావృతం అవుతుందన్నారు.