పాట్నా: బీహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, బుధవారం తన పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తనను విష్ చేసిన బీజేపీ నేతలను ‘ప్రత్యేక’ గిఫ్ట్ కోరారు. వారి నుంచి తాను ఆశిస్తున్న పెద్ద బహుమతి బీహార్కు ప్రత్యేక హోదా అని అన్నారు. తేజస్వీ యాదవ్ బుధవారం 33 వ ఏటా అడుగుపెట్టారు. ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు తేజస్వీతో మాట్లాడారు. బీజేపీ నేతలు ఆయనను విష్ చేయడంపై స్పందించాలని కోరారు. ‘బీజేపీకి చెందిన చాలా మంది నేతలు నాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. అయితే వారిని నేను ఒక బహుమతి అడగాలనుకుంటున్నాను. నేను ఆశిస్తున్న అతి పెద్ద బహుమతి బీహార్కు ప్రత్యేక హోదా. రాష్ట్రంలోని భారీ యువ జనాభాకు ఇది ప్రయోజనం చేకూరుస్తుంది’ అని అన్నారు.
ఈ సందర్భంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, పంచాయతీరాజ్ విభాగాల్లో నియామకాలకు సంబంధించిన నియామక పత్రాలను తేజస్వీ యాదవ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం నితీశ్ కుమార్ పాదాలను తాకి ఆయన ఆశీసులు పొందారు.
కాగా, పది లక్షల ఉద్యోగాలు ఇవ్వాలన్న తమ ప్రతిజ్ఞను నెరవేరుస్తామని సీఎం నితీశ్ కుమార్ తెలిపారు. ఆర్జేడీతో కలిసి మహాకూటమి ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలైన రోజునే తేజస్వీ యాదవ్ తన పుట్టిన రోజును జరుపుకోవడంతోపాటు ఆయన మంత్రిత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి నియామక పత్రాలు అందజేయడం విశేషమని అన్నారు. ఈ సందర్భంగా తేజస్వీ యాదవ్ను ఆయన హత్తుకున్నారు.
#NitishKumar ने खास अंदाज में दी जन्मदिन की बधाई तो #TejashwiYadav ने भावुक होकर छुए पैर pic.twitter.com/SuVDQEyuX8
— NDTV India (@ndtvindia) November 9, 2022