హైదరాబాద్ : గతేడాది చివరలో దక్షిణాఫ్రికాలో గుర్తించిన ఒమిక్రాన్ వేరియంట్ భారత్లో థర్డ్ వేవ్కు కారణమైంది. ఈ వేరియంట్ ముఖ్యంగా దక్షిణభారతంపై తీవ్ర ప్రభావం చూపినట్లు తేలింది. గత నెల జనవరిలో సుమారు 60శాతం కుటుంబాల్లో ఇద్దరు చొప్పున మహమ్మారి లక్షణాలతో బాధపడగా.. తెలంగాణ, ఏపీల్లో 57శాతం కుటుంబాలపై ప్రభావం చూపిందని హైపర్ లోకల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘లోకల్’ యాప్ నిర్వహించిన అధ్యయనంలో గుర్తించారు.
‘లోకల్ యాప్’ గత జనవరిలో తమిళనాడు, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాల్లోని టైర్-2, 3 జిల్లాలకు చెందిన 17,500 మందితో సర్వే చేపట్టింది. స్థానిక భాషల్లో నిర్వహించిన సర్వేలో 22-40 సంవత్సరాల మధ్య వయస్సున్న వారు పాల్గొన్నారు. సంవత్సరం ప్రారంభంలోనే కొవిడ్తో దక్షిణాధి రాష్ట్రాలు ఉక్కిరిబిక్కిరి అయినట్లు గుర్తించారు.
వైరస్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందిందని, 60శాతం మంది కుటుంబంలో కనీసం ఇద్దరు వైరస్ బారినపడినట్లు పేర్కొన్నారు. ఇందులో 25శాతం మంది దగ్గు, జలుబు, గొంతు నొప్పి లక్షణాలతో బాధపడ్డారని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణకు వస్తే సర్వేలో పాల్గొన్న వారిలో 57శాతం కుటుంబాలు ఒమిక్రాన్ బారినపడగా.. ఇంటికి ఇద్దరు చొప్పున వైరస్తో ఇబ్బందులకు గురయ్యారు.
కరోనా థర్డ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో చాలా మంది జనం అప్రమత్తమయ్యారు. 76శాతం మంది రెండు మూడు రోజుల పాటు లక్షణాలు కనిపిస్తే డాక్టర్ను సంప్రదించినట్లు.. కేవలం 13శాతం మంది మాత్రమే వారం తర్వాత డాక్టర్ను కలిసినట్లు సర్వేలో పేర్కొన్నారు. ప్రభుత్వానికి తగిన సహకారం అందించడంలో దక్షిణ భారత్ వాసులు నిబద్ధతను చాటుకున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది.
ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన ఆంక్షలకు ప్రజలు కట్టుబడి ఉన్నారని, నిబంధనలను తూచా తప్పకుండా పాటించినట్లు పేర్కొన్నారు. దాదాపు 82 శాతం మంది సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉండడం, ప్రయాణాలను రద్దు చేసుకున్నట్లు తెలిపారు. మరో వైపు సెల్ఫ్ టెస్టింగ్ కిట్ల వినియోగంపై టైర్-2, 3 నగరాల్లో అవగాహన పెరిగిందని, 23శాతం మంది సెల్ఫ్ టెస్టింగ్ కిట్లను వినియోగించినట్లు పేర్కొన్నారు.