కరోనా పాజిటివ్ వస్తేనే అందరూ భయపడిపోతున్నారు. వెంటనే ఐసొలేషన్లోకి వెళ్లిపోతున్నారు. కానీ ఒక కుటుంబం మాత్రం ఈ నిబంధనలను అసలు పట్టించుకోలేదు. కరోనా వచ్చిందని తెలిసిన తర్వాత కూడా విచ్చలవిడిగా ప్రవర్తించింది. జమ్మూకశ్మీర్, పంజాబ్ ట్రిప్ వేసింది. ఈ ఘటన ముంబైలో వెలుగు చూసింది.
థానేకు చెందిన ఒక కుటుంబం ఇటీవలే కెన్యా నుంచి తిరిగొచ్చింది. ఇలా వచ్చిన వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆ కుటుంబాన్ని ఇంట్లోనే హోం ఐసొలేషన్లో ఉండాలని సూచించింది. ఆపై వారి శాంపిల్స్ను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపింది.
అక్కడి నుంచి రిజల్ట్ వచ్చే వరకూ చాలా జాగ్రత్తగా ఉండాలని ఆ కుటుంబానికి అధికారులు సూచనలు చేశారు. అయితే వారి మాటలు పట్టించుకోని ఆ కుటుంబం.. జమ్మూకశ్మీర్ ట్రిప్ వెళ్లింది. అక్కడి నుంచి అమృత్సర్ చేరుకొని బంధువుల ఇంట్లో కొన్నిరోజులపాటు విడిది చేసింది.
అదే సమయంలో ఆ కుటుంబంలోని ముగ్గురి శాంపిల్స్లో ఒమిక్రాన్ పాజిటివ్ ఫలితం వచ్చింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన అధికారులు సదరు కుటుంబంపై కేసు నమోదు చేసుకున్నారు. వీరితోపాటు ఈ కుటుంబాన్ని తన ఇంట్లో ఉంచుకున్న మహిళపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు చెప్పారు. ఈ కుటుంబంలోని భార్యాభర్తలు, ఇద్దరు పిల్లల్లో ముగ్గురికి కరోనా సోకింది. ఈ ముగ్గురికీ ఒమిక్రాన్ కూడా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.