ముంబై, మే 28: మహారాష్ట్రలో ఒమిక్రాన్ వైరస్ సబ్ వేరియంట్లు వెలుగులోకి వచ్చాయి. నలుగురికి బీ.ఏ.4, ముగ్గురికి బీ.ఏ.5 వేరియంట్లు సోకినట్టు అధికారులు గుర్తించారు. వారందరికీ కూడా స్వల్ప లక్షణాలే ఉన్నాయని, ఇంట్లోనే చికిత్స అందజేసినట్టు రాష్ట్ర వైద్య శాఖ అధికారులు వెల్లడించారు. వీరంతా పుణేకు చెందిన వారని తెలిపారు. వీరిలో 9 ఏండ్ల పాప కూడా ఉన్నది. అయితే వైరస్ సోకిన వారిలో ఆరుగురు రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ వేసుకోగా, ఒకరు బూస్టర్ డోసు కూడా వేసుకున్నారు.
9 ఏండ్ల పాప మాత్రం వ్యాక్సిన్ వేసుకోలేదు. వీరిలో ఇద్దరు దక్షిణాఫ్రికా, బెల్జియం దేశాలు వెళ్లి వచ్చారు. ముగ్గురు మాత్రం కేరళ, కర్ణాటకకు ప్రయాణం చేశారు. రాష్ట్రంలో రోజుకు వెయ్యి కరోనా పాజిటివ్ కేసులు నమోదైతే లాక్డౌన్ వంటి చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆ రాష్ట్ర మంత్రి అస్లాం షేక్ హెచ్చరించారు. ప్రజలు కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. మహారాష్ట్రలో కొత్తగా 529 కరోనా కేసులు నమోదయ్యాయి.