న్యూఢిల్లీ, జనవరి 23: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ సమూహ వ్యాప్తి(కమ్యూనిటీ ట్రాన్స్మిషన్) దశలో ఉన్నదని ఇన్సాకాగ్ పేర్కొన్నది. అన్ని మెట్రో నగరాల్లో నమోదవుతున్న కేసుల్లో ఈ వేరియంట్వే ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ.2 కేసులు కూడా గణనీయంగా ఉన్నట్టు తెలిపింది. ఇన్సాకాగ్ ఇప్పటివరకు 1,27,697 నమూనాలకు జన్యువిశ్లేషణ చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి రేటును సూచించే ఆర్-నాట్ విలువ దేశంలో క్రమంగా తగ్గిపోతున్నదని, మూడో వేవ్ 14 రోజుల్లో గరిష్ఠ స్థాయికి చేరుకోవచ్చని ఐఐటీ మద్రాస్ అంచనా వేసింది. ఈ నెల 14-21 మధ్యలో ఆర్-నాట్ విలువ 1.57కు తగ్గిందని తెలిపింది. ఇది జనవరి 1-6 మధ్యలో 4, జనవరి 7-13 మధ్యలో 2.2గా ఉన్నట్టు తెలిపింది. కంప్యూటేషనల్ మోడలింగ్ ద్వారా ఐఐటీ మద్రాస్ కరోనా వ్యాప్తిపై విశ్లేషించి ప్రాథమిక ఫలితాలు వెల్లడించింది. ముంబైలో ఆర్-నాట్ విలువ 0.67, ఢిల్లీలో 0.98, చెన్నైలో 1.2గా ఉన్నట్టు వెల్లడించింది. ఆర్-నాట్ విలువ 1 కంటే తక్కువగా ఉంటే మహమ్మారి ఉద్ధృతి తగ్గినట్టు భావిస్తారు.
3.33 లక్షల కొత్త కేసులు
దేశంలో వరుసగా నాలుగో రోజూ 3 లక్షలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో (శనివారం నుంచి ఆదివారం నాటికి) 3,33,533 కేసులు రికార్డయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,92,37,264కు చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 21,87,205గా ఉన్నది. ఇదే సమయంలో వ్యాధి బారిన పడిన వారిలో తాజాగా 525 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,89,409కి పెరిగింది. డైలీ పాజిటివిటీ రేటు 17.78 శాతంగా కొనసాగుతున్నది.
ఢిల్లీలో సగానికి తగ్గిన కేసులు
ఢిల్లీతో పాటు ముంబైలో కరోనా కేసులు క్రమంగా దిగివస్తున్నాయి. ఢిల్లీలో గతం వారంతో పోలిస్తే కేసు లు సగానికి తగ్గాయి. ఈ నెల 13న గరిష్ఠస్థాయికి (28వేలకుపైగా) చేరిన కేసులు అనంతరం తగ్గు కుంటూ వస్తున్నాయి. ఆదివారం 9197 కేసులు రికా ర్డయ్యాయి. పాజిటివిటీ రేటు 13 శాతంగా ఉన్నది. ముంబైలో ఈ నెల 7 గరిష్ఠంగా 20,971 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత క్రమంగా తగ్గుదల న మోదవుతున్నది. గత రెండు వారాల్లో కేసులు 83% తగ్గాయి. తాజాగా ఆదివారం 2550 నమోద య్యాయి. పాజిటివిటీ రేటు 7 శాతంగా ఉన్నది.