న్యూఢిల్లీ, డిసెంబర్ 11: రెండు వారాలుగా మూడు రాష్ర్టాల్లోని 8 జిల్లాల్లో కొవిడ్ పాజిటివిటీ రేటు 10 శాతానికి పైగా నమోదవుతుండడంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. అవసరమైతే నైట్ కర్ఫ్యూ విధించాలని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. పాజిటివిటీ రేటు 10 శాతానికి పైగా లేదా కేటాయింపులో 60 శాతం బెడ్లు నిండితే.. ఆయా గుర్తించిన ప్రాంతాల్లో నైట్కర్ఫ్యూ విధించడంతో పాటు సామూహిక కార్యక్రమాలపై నిషేధం విధించాలని స్పష్టం చేసింది.
ఢిల్లీలో ఒమిక్రాన్ రెండో కేసు
ఢిల్లీలో ఒమిక్రాన్ రెండో కేసు నమోదైంది. దీంతో దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 33కు పెరిగింది. ఒమిక్రాన్ వ్యాప్తి ఆందోళనల నేపథ్యంలో ప్రజలు గుమిగూడడాన్ని నిషేధిస్తూ ముంబైలో శని, ఆదివారాల్లో సెక్షన్ 144 విధించారు.
వ్యాక్సినేషన్కు అంతరాయం!
ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో వాయుకాలుష్యాన్ని నిరోధించేక్రమంలో రోజుకు కోటిన్నరకు పైగా సిరంజీలను ఉత్పత్తి చేసే ఫరీదాబాద్లోని హిందుస్థాన్ సిరంజీస్ అండ్ మెడికల్ డివైసెస్ ప్లాంట్ల మూసివేతకు హర్యానా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆదేశించింది. అయితే దీనిపై మినహాయింపునివ్వాలని హర్యానా ప్రభుత్వాన్ని కోరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారి ఒకరు శనివారం చెప్పారు.
ఏ వేరియెంట్ వచ్చినా సిద్ధం..
కరోనా వైరస్ ఎప్పటికప్పుడు తన రూపం మార్చుకుంటూ ప్రజలపై విరుచుకుపడుతున్నది. ఎన్ని వేరియెంట్లయినా సరే సమర్థంగా ఎదుర్కొనేందుకు అమెరికాలోని రాక్ఫెల్లర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వినూత్నమైన కిట్ను కనిపెట్టారు. ఒంటె జాతికి చెందిన లామాల నుంచి సేకరించిన నానోబాడీలు (అతి సూక్ష్మ యాంటిబాడీలు).. కరోనా నుంచి పూర్తి రక్షణ ఇస్తాయని వారు గుర్తించారు. ఇవి మన శరీరంలోని యాంటిబాడీల కన్నా 10 రెట్లు తక్కువ సైజులో ఉంటాయి. పైగా 60 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల వద్ద కూడా స్థిరంగా ఉంటాయి. ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లను తక్కువ ఉష్ణోగ్రతల వద్దే భద్రపరచాల్సి ఉంటుంది. ఈ సమస్యను లామాల యాంటిబాడీలు అధిగమించనున్నాయి.