న్యూఢిల్లీ : కరోనా కొత్త ఉత్పరివర్తనం ఒమిక్రాన్ ప్రపంచాన్ని మరోసారి భయాందోళనలకు గురి చేస్తున్నది. ఇప్పటికే ఈ వేరియంట్ కేసులు 20కిపైగా దేశాల్లో నిర్ధారణ అయ్యాయి. కొత్తగా రూపాంతరం చెందిన ఒమిక్రాన్ ఎంత మేరకు ప్రాణాంతకమైందో.. జనంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ప్రస్తుతానికి చెప్పడం కష్టమని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు ఎక్కువగా యువతనే ప్రభావితం చేసిందని చెప్తున్నారు.
ఒమిక్రాన్ తేలికపాటి అనారోగ్య సమస్యలు కలిగిస్తున్నదో? లేదో? త్వరగా నిర్ధారించాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. దీనిపై మరింత సమాచారం సేకరిస్తున్నట్లు తెలిపారు. రాబోయే రెండు మూడు వారాల్లో పూర్తి సమాచారం తెలుస్తుందని చెప్పారు. కొత్త వైరస్ బారినపడిన కొంత మంది పేషెంట్లు అడ్మిట్ అయ్యారని, వారంతా 40 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వారేనని చెబుతున్నారు.
ఈ సందర్భంగా ఎన్ఐసీడీ (NICD) పబ్లిక్ హెల్త్ సర్వైలెన్స్ అండ్ రెస్పాన్స్ హెడ్ మిచెల్ గ్రోమ్ మాట్లాడుతూ.. కరోనా కొత్త ఉత్పరివర్తనం ఒమిక్రాన్ బాధితుల్లో ఎక్కువ మంది యువకులే ఉన్నారని తెలిపారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ప్రకారం.. గత 24 గంటల్లో దక్షిణాఫ్రికాలో రోజువా కొత్త కేసుల సంఖ్య రెట్టింపై.. 8,561కి చేరింది. తాజా కేసుల్లో ఎక్కువగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇదిలా ఉండగా.. దక్షిణాఫ్రికా ప్రభుత్వం, శాస్త్రవేత్తలు నవంబర్ 25న దేశంలో కరోనా కొత్త వేరియంట్ కొత్త వేరియంట్ను (B.1.1.529) గుర్తించినట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఈ వేరియంట్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒమిక్రాన్ (B.1.1.529)గా పేరుపెట్టింది. కొత్త వేరియంట్ను గుర్తించిన తర్వాత అమెరికా, యూరోపియన్ యూనియన్, కెనడా, ఇజ్రాయెల్, ఆస్ట్రేలియాతో పలు దేశాల్లో నమోదయ్యాయి. ఈ క్రమంలో చాలా దేశాలు దక్షిణాఫ్రికాపై ప్రయాణ ఆంక్షలు విధించడంతో పాటు విమాన సర్వీసులు సైతం నిలిపివేశాయి.