శ్రీనగర్: జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) బారాముల్లా లోక్సభ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ఈ మేరకు శుక్రవారం ప్రకటించారు. పార్టీకి కంచుకోటగా ఉన్న సెంట్రల్ కశ్మీర్లోని శ్రీనగర్ నియోజకవర్గం నుంచి ప్రముఖ షియా నాయకుడు అగా సయ్యద్ రుహుల్లా మెహదీ పోటీ చేస్తారని తెలిపారు.
కాగా, లోక్సభ ఎన్నికల్లో బారాముల్లా స్థానం నుంచి పోటీ చేస్తున్నట్లు ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు.
ఉత్తర కశ్మీర్పై బీజేపీ ఎక్కువగా దృష్టి సారించిందని తెలిపారు. అందుకే తాను ఇక్కడ పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ‘ఉత్తర కశ్మీర్లో ఈ శక్తులు ఓడిపోవాలని నేను కోరుకుంటున్నా’ అన్ని అన్నారు.
మరోవైపు లోక్సభ ఎన్నికల్లో తన పోరాటం ఒక వ్యక్తిపై కాదని ఒమర్ అబ్దుల్లా తెలిపారు. బీజేపీ కుట్రలు, ద్రోహం, రాజకీయ కుతంత్రాలకు వ్యతిరేకంగా అని అన్నారు. ఎన్సీ ఉపాధ్యక్షుడైన ఒమర్ అబ్దుల్లా 2009 తర్వాత తొలిసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. జమ్ముకశ్మీర్కు తిరిగి రాష్ట్ర హోదా దక్కే వరకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆయన ప్రమాణం చేశారు.