బెళగావి, అక్టోబర్ 2: అనారోగ్యంతో దవాఖానలో ఐసీయూలో ఉన్న వృద్ధురాలి(79)ని అధికారులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి రప్పించిన ఘటన కర్ణాటకలోని బెళగావిలో చోటుచేసుకొన్నది. తిలక్వాడీ గ్రామానికి చెందిన మహాదేవి అగసిమణి (79) వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో దవాఖానలో చేరింది. తన పేర ఉన్న రెండు ఎకరాల 35 గుంటల భూమిని తన ఇద్దరు పిల్లల పేరున రాయాలనుకొన్నది. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, రూ.2 లక్షల లంచం ఇస్తేనే వస్తామని చెప్పారు. దీంతో చేసేదేమి లేక కుటుంబ సభ్యులు వృద్ధురాలిని స్ట్రెచర్పై సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కు తీసుకెళ్లి, సంతకాలు చేయించారు. దీనికి సంబంధించిన చిత్రాలు నెట్లో వైరల్ అయ్యాయి. కర్ణాటక సర్కారుపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాగా, ఈ విషయంపై సంబంధిత అధికారుల నుంచి వివరణ అడిగామని డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ శివ్కుమార్ తెలిపారు.