భువనేశ్వర్ : ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పూరీ జగన్నాథుడి దేవాలయంలో (Jagannath Temple) భక్తులకు స్వామివారి దర్శనాలు కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా కేసులు భారీగా వెలుగు చూసిన నేపథ్యంలో ఈ నెల 10 నుంచి 31 వరకు ఆలయాన్ని మూసివేశారు. భక్తులకు దర్శనాలను మాత్రం నిలిపివేసిన అధికారులు, ఆలయంలో సంప్రదాయం ప్రకారం అంతరాయం లేకుండా పూజాధికాలు నిర్వహించారు. భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో ఫిబ్రవరి నుంచి ఆలయాన్ని తిరిగి తెరవాలని నిర్ణయించినట్లు కలెక్టర్ సమర్థ్ వర్మ పేర్కొన్నారు.
ఆలయాన్ని శానిటైజ్ చేసేందుకు ప్రతి ఆదివారం మూసివేస్తామని, భక్తులకు ఎలాంటి దర్శనాలుండవన్నారు. స్థానికులకు పడమర ద్వారం నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు తూర్పు ద్వారం నుంచి ప్రవేశం కల్పించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. అయితే, స్థానిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పండుగ రోజుల్లో ఆలయాన్ని మూసివేయనున్నట్లు పూరీ కలెక్టర్ తెలిపారు. త్వరలోనే దర్శనాలకు సంబంధించి విధివిధానాలను విడుదల చేస్తామన్నారు. దర్శన సమయాలు, మందిరంలోకి వచ్చే ముందుకు భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పేర్కొననున్నట్లు తెలిపారు.