భువనేశ్వర్ : రక్త హీనతతో బాధపడుతున్న ఓ మహిళకు వేరే బ్లడ్ గ్రూప్ రక్తం ఎక్కించడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఒడిశాలోని రూర్కీలా ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. సుందర్ గర్హ్ జిల్లాకు చెందిన సరోజిని కాకు అనే 25 ఏండ్ల మహిళ సికెల్ సెల్ ఎనిమియా వ్యాధితో బాధపడుతోంది.
దీంతో ఆమె చికిత్స నిమిత్తం రూర్కీలా ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. అయితే ఆమె బ్లడ్ గ్రూప్ O పాజిటివ్ కాగా, B పాజిటివ్ రక్తం ఎక్కించారు. ఈ క్రమంలో ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించి చనిపోయింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మహిళ చనిపోయిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.