భువనేశ్వర్: ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రి నవకిశోర్ దాస్ను ఆదివారం ఉదయం ఏఎస్సై గోపాల్ దాస్ కాల్చిచంపడంతో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆరోగ్యశాఖ బాధ్యతలను మరో మంత్రికి అప్పగించారు. ఆర్థికశాఖ మంత్రి నిరంజన్ పుజారికి అదనంగా ఆరోగ్యశాఖ బాధ్యతలను కూడా కట్టబెట్టారు. ఒడిశా సీఎం కార్యాలయం ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించింది.
ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రి నవకిశోర్ దాస్ ఆదివారం ఉదయం ఝార్సుగూడ జిల్లా బ్రజ్రాజ్నగర్లోని ఓ ఆలయంలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లారు. ఆయన కారు దిగుతుండగానే ఏఎస్సై గోపాల్ దాస్ అతనిపై రెండు రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయాడు. బుల్లెట్లు గుండెలోకి దిగడంతో భువనేశ్వర్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై విచారణ జరుగుతున్నది.