న్యూఢిల్లీ: ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టెలిగ్రామ్ తదితర ప్రముఖ సోషల్ మీడియా వేదికల్లో బాలల లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్, అశ్లీల చిత్రాలు, తుపాకుల ప్రదర్శన లాంటి అసాంఘిక అంశాలు యథేచ్ఛగా కనిపిస్తున్నాయని ‘ఎన్డీటీవీ’ జరిపిన తాజా పరిశోధనలో తేలింది. ఇటువంటి కంటెంట్ను నిషేధించినప్పటికీ, ఆన్లైన్లోకి చొరబడుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. రూ.50 చెల్లిస్తే, బాలల లైంగిక వేధింపులకు సంబంధించిన మెటీరియల్ను విక్రయించే చానళ్లను ఎన్డీటీవీ గుర్తించింది. దీనిపై సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘టెలిగ్రాం’ స్పందిస్తూ తాము 2026లో సుమారు 3.05 లక్షలకు పైగా ఇటువంటి చానళ్లను తొలగించామని, అధునాతన సాంకేతికతతో నిరంతరం నిఘా ఉంచుతున్నామని తెలిపింది. ఇదేవిధంగా ‘ఇన్స్టాగ్రామ్’లోనూ పిల్లలకు సంబంధించిన అశ్లీల చిత్రాలు, రెచ్చగొట్టే క్యాప్షన్లతో కూడిన వీడియోలు అందుబాటులో ఉన్నట్లు తేలింది.
వీటిపై ప్రభుత్వం ఇప్పటికే మెటా సంస్థను వివరణ కోరింది. ఇటువంటి కంటెంట్ను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. ఫేస్బుక్లో కృత్రిమమేధ సాయంతో సృష్టించిన అశ్లీల చిత్రాలు, మహిళలను కించపరిచేలా ఉన్న కంటెంట్ అపరిమితంగా ఉన్నట్లు తేలింది. ఇవేకాకుండా తుపాకులు, గ్యాంగ్ కల్చర్ను ప్రోత్సహించే వీడియోలు కనిపిస్తున్నాయి. ఇటువంటి ఉదంతాలపై మెటా సంస్థ స్పందిస్తూ, తమ ప్లాట్ఫామ్లలో లైంగిక దోపిడీ, అక్రమ కార్యకలాపాలకు తావులేదని, అటువంటి సమాచారం తమ దృష్టికి వచ్చిన వెంటనే తొలగిస్తున్నామని తెలిపింది.