చండీఘఢ్ : హరియాణలో చెలరేగిన అల్లర్లకు బాధ్యులపై బుల్డోజర్ యాక్షన్ కొనసాగుతోంది. నుహ్లో (Nuh violence) ఇటీవల చెలరేగిన హింసాత్మక ఘర్షణలో ఓ రెస్టారెంట్ కమ్ హోటల్ నుంచి దుండగులు రాళ్లు రువ్వగా ఆదివారం జిల్లా అధికారులు ఆ హోటల్ను నేలమట్టం చేశారు. హోటల్ కూల్చివేత నేపధ్యంలో ఆ ప్రాంతంలో పెద్దసంఖ్యలో పోలీస్ బలగాలను మోహరించారు.
సహారా ఫ్యామిలీ రెస్టారెంట్ కమర్షియల్ భవనాన్ని అక్రమంగా నిర్మించారని జిల్లా టౌన్ ప్లానింగ్ అధికారి వినేష్ కుమార్ తెలిపారు. ఓ వర్గం వారు చేపట్టిన ఊరేగింపుపై ఈ భవనం నుంచే కొందరు రాళ్లు విసిరారని చెప్పారు. ఈ భవనం అక్రమ నిర్మాణమని పేర్కొంటూ ప్రభుత్వం నోటీసులు జారీ చేసిందని అన్నారు. అల్లరి మూకలు ఈ భవనం నుంచే యాత్రపై రాళ్లు విసిరారని, అందుకే ఈ చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు.
కాగా అంతకుముందు శనివారం ఉదయం నుహ్లో జిల్లా అధికారులు నల్హార్ రోడ్ ప్రాంతంలోని అక్రమంగా నిర్మించిన 45 దుకాణాలను కూల్చివేశారు. జులై 31న నుహ్ జిల్లాలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో ఇద్దరు హోంగార్డులు సహా ఆరుగురు మరణించారు. ఈ ఘటనలకు సంబంధించి 141 మందిని అరెస్ట్ చేసి 55 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్టు హరియాణ పోలీసులు తెలిపారు.
Read More :