న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. మరో వైపు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కేసుల సంఖ్య పెరుగుతున్నది. దీంతో అధికారులు లాక్డౌన్ తదితర చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో భారత్లో ఒమిక్రాన్ ఎక్స్ఈ స్ట్రెయిన్ తొలి కేసు నమోదైంది. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ (NTAGI) చీఫ్ డాక్టర్ ఎన్కే అరోరా మాట్లాడుతూ.. ఎక్స్ఈ తరహాలో మరిన్ని వేరియంట్లు వస్తాయన్నారు.
అయితే వీటితో భయపడాల్సిన అవసరం లేదన్నారు. దేశంలో ప్రస్తుతం కేసుల సంఖ్య అంత వేగంగా పెరగడం లేదన్నారు. అయితే, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇటీవల ఒమిక్రాన్ కొత్త స్ట్రెయిన్ ఎక్స్ఈ తొలి కేసు గుజరాత్లో నమోదైన విషయం తెలిసిందే. అయితే అంతకు ముందు ముంబైలో కేసును గుర్తించామని బీఎంసీ ప్రకటించగా.. అప్పటి వరకు ఎక్స్ఈ వేరియంట్ అని నిర్ధారణ కాలేదు. ఇదిలా ఉండగా.. బీఏ.2 వేరియంట్ కంటే ఎక్స్ఈ పదిశాతం వేగంగా వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.