దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో అండర్ గ్యాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఈ ఏడాదినుంచి కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీయూఈటీ) నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా సీయూఈటీలో పాల్గొనాలనుకునే సెంట్రల్ యూనివర్సిటీలు, ఇతర విద్యా సంస్థల నుంచి ఎన్టీఏ శుక్రవారం దరఖాస్తులు ఆహ్వానించింది. http://nta.ac.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. సీయూఈటీ 2022 ప్రవేశపరీక్ష కోసం ఏప్రిల్ 2, 2022 (శనివారం)నుంచి విద్యార్థులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది.
సెంట్రల్ యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులతోపాటు పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం సీయూఈటీ 2022ను నిర్వహిస్తున్నారు. కేంద్రీయ విశ్వవిద్యాలయాలతోపాటు ఇతర సంస్థలకు కూడా ఈ ప్రవేశపరీక్షలో పాల్గొనే అవకాశం కల్పించారు. ఇందులో పాల్గొనాలనుకునే ఇతర సంస్థలుకూడా దరఖాస్తు ఫారంను నింపాల్సి ఉంటుంది. ఇన్స్టిట్యూట్ పేరు, ఎస్టాబ్లిష్మెంట్ సంవత్సరం, ఇన్స్టిట్యూట్ రకం, విద్యార్థుల సంఖ్యలాంటివి దరఖాస్తు ఫారంలో నింపాలి. ఎన్టీఏలో దరఖాస్తు చేసుకున్న సంస్థలు అండర్గ్రాడ్యుయేట్, పీజీ కోర్సుల్లో విద్యార్థుల ప్రవేశాలకు సీయూఈటీ స్కోరును ఆధారం చేసుకోవచ్చు.