న్యూఢిల్లీ: ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా ‘వందే భారతం-నృత్య ఉత్సవ్’ (Nrityotsavam) పేరుతో ఈనెల 17 నుంచి ఆలిండియా డ్యాన్స్ పోటీలు నిర్వహించనున్నట్లు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ పోటీల్లో తుది విజేతలుగా నిలిచేవారు వచ్చే ఏడాది జనవరి 26న జరగనున్న రిపబ్లిక్ పరేడ్ సందర్భంగా నాట్య ప్రదర్శన చేస్తారని పేర్కొంది.
ఈ పోటీలు క్లాసికల్, ఫోక్, ట్రైబల్, ఫ్యూజన్/కాంటెంపరరీ అనే నాలుగు కేటగిరీల్లో జిల్లా, రాష్ట్ర, జోనల్, ఇంటర్ జోనల్/నేషనల్ స్థాయిల్లో జరుగుతాయని కేంద్ర సహాయ మంత్రి మీనాక్షి లేఖి తెలిపారు. ఆ తరువాత తుది జాతీయ స్థాయి పోటీలు ఢిల్లీలో డిసెంబర్ 19న జరుగుతాయని, అక్కడి నుంచి 480 మందిని ఎంపిక చేయనున్నట్టు చెప్పారు. విజేతలకు రిపబ్లిక్ పరేడ్లో నాట్య ప్రదర్శన చేసే అవకాశం దక్కుతుందని వివరించారు.