చండీగఢ్: జీవిత బీమా డబ్బు కోసం ఎన్నారై మహిళను అత్తమామలు హత్య చేశారు. (NRI woman Killed for insurance money) ఆమె మృతదేహాన్ని ఫ్రీజర్లో రెండు రోజులు ఉంచారు. గుండెపోటుతో చనిపోయినట్లు నమ్మించేందుకు ప్రయత్నించారు. అయితే ఆ మహిళను హత్య చేసినట్లు పోస్ట్మార్టం రిపోర్ట్లో బయటపడింది. పంజాబ్లోని కపుర్తలా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అమెరికా పౌరురాలైన 32 ఏళ్ల రాజ్దీప్ కౌర్ ఐదేళ్ల పాపతో కలిసి జనవరి 12న పంజాబ్లోని అత్త వారింటికి వచ్చింది. అయితే ఆమె పేరు మీద భారీగా జీవిత బీమా ఉన్నది. ఈ నేపథ్యంలో నానో మల్లియన్ గ్రామానికి చెందిన అత్తమామలు దల్జీత్ కౌర్, జగదేవ్ సింగ్ జనవరి 19 అర్ధ రాత్రి తర్వాత రాజ్దీప్ కౌర్ గొంతు నొక్కి హత్య చేశారు. ఆ తర్వాత సిధ్వా డోనా గ్రామంలో ఆమె మృతదేహాన్ని రెండు రోజులు ఫ్రీజర్లో ఉంచారు. గుండెపోటుతో చనిపోయినట్లు బ్రిటన్లో ఉన్న ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.
కాగా, రాజ్దీప్ కౌర్ తల్లి నిర్మల్ కౌర్ బ్రిటన్ నుంచి భారత్కు వచ్చింది. తన కుమార్తె మరణంపై ఆమె అనుమానం వ్యక్తం చేయడంతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుమార్తె ఆస్తులు స్వాధీనం చేసుకున్నారని, పెళ్లి వేడుక పేరుతో రప్పించి జీవిత బీమా డబ్బు కోసం హత్య చేశారని ఆరోపించింది.
మరోవైపు రాజ్దీప్ కౌర్ మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించారు. ఆమె గొంతునొక్కి ఊపిరాడకుండా చేసి చంపినట్లు రిపోర్ట్ వచ్చింది. ఈ నేపథ్యంలో కౌర్ అత్తమామలతోపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్న భర్త మంజీందర్ సింగ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.