NRI | కుమార్తె వివాహం నిమిత్తం భారత్ వచ్చిన ఓ ఎన్నారైకి ఊహించని ఘటన ఎదురైంది. ప్రయాణ సమయంలో చాలా విలువైన వస్తువులు కలిగిన ఓ బ్యాగ్ను పోగొట్టుకున్నారు. క్యాబ్లో హోటల్కు వెళ్లిన సదరు ఎన్నారై.. రూమ్కి వెళ్లి చూడగా లగేజీలోని బ్యాగ్ మిస్ అయినట్లు గుర్తించారు. ఆ బ్యాగ్లో రూ.కోటి విలువ చేసే బంగారు నగలతోపాటు ఇతర ఖరీదైన వస్తువులు ఉన్నాయి. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నిఖిలేష్ కుమార్ సిన్హా కుటుంబం లండన్లో నివసిస్తుంటారు. కూతురు వివాహం కోసం ఇటీవల భారత్ చేరుకున్నారు. ఈ క్రమంలో గ్రేటర్ నోయిడాలోని గౌర్ సిటీ ప్రాంతంలో గల సరోవర్ పోర్టికో హోటల్కు క్యాబ్లో వెళ్లారు. క్యాబ్ దిగి రూమ్కి వెళ్లి చూడగా.. లగేజీలోని ఓ బ్యాగ్ కనిపించలేదు. మిస్ అయిన బ్యాగ్లో కోటి విలువైన బంగారు నగలతోపాటు ఇతర ఖరీదైన వస్తువులు ఉన్నాయి. దీంతో వారు వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించారు. వారు ఇచ్చిన ఆధారాల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు క్యాబ్ డ్రైవర్ను ట్రేస్ చేసి పట్టుకున్నారు.
ఘజియాబాద్ జిల్లా లాల్ కౌన్ ప్రాంతంలో బ్యాగ్ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బ్యాగ్ను, అందులోని విలువైన వస్తువులను నిఖిలేష్ సిన్హాకు సురక్షితంగా అప్పగించినట్లు పోలీసు ఉన్నతాధికారి అనిల్ కుమార్ రాజ్పుత్ వివరించారు. ఫిర్యాదు చేసిన నాలుగు గంటల్లోనే బ్యాగ్ను సురక్షితంగా తమకు అప్పగించినందుకు నిఖిలేష్ సిన్హా కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.