అహ్మదాబాద్: విదేశాల్లో స్థిరపడిన ఎన్నారై జంటకు తర్వలో పెళ్లి జరుగనున్నది. ఒక వివాహ వేడుక కోసం భారత్ వచ్చిన వారిద్దరిని విధి దూరం చేసింది. విమానం ఆలస్యం వల్ల హోటల్లో బస చేయగా అక్కడ జరిగిన అగ్రిప్రమాదంలో ఆ జంట మరణించింది. (NRI Couple Killed In Fire Accident). ఈ నేపథ్యంలో ఆ రెండు కుటుంబాల్లో విషాదం నెలకొన్నది. గుజరాత్ కచ్ జిల్లాలోని రామ్పూర్ గ్రామానికి చెందిన 28 ఏండ్ల కిషన్ హలాయ్, అతడి కుటుంబం నైరోబీలో స్థిరపడింది. అక్కడే పుట్టి స్థిరపడిన బంధువుల అమ్మాయి 25 ఏండ్ల రూపల్ వెకారియాతో అతడికి నిశ్చితార్థం జరిగింది. ఈ జంటకు తర్వలో నైరోబీలో పెళ్లి జరుగనున్నది.
కాగా, కిషన్ తమ్ముడి వివాహం ఇటీవల రామ్పూర్ గ్రామంలో జరిగింది. ఈ వేడుక కోసం కిషన్ తన కుటుంబంతోపాటు కాబోయే భార్య రూపల్, ఆమె కుటుంబంతో కలిసి నెల కిందట భారత్ వచ్చాడు. సోదరుడి పెళ్లి తర్వాత ఆ కొత్త జంట, కిషన్ తల్లిదండ్రులు వారం కిందట కెన్యా వెళ్లారు.
మరోవైపు తన బంధువులను కలిసిన కిషన్, కాబోయే భార్య రూపల్, ఆమె కుటుంబంతో కలిసి నైరోబీకి తిరిగి వెళ్లేందుకు ప్రయాణమయ్యాడు. శనివారం అహ్మదాబాద్ నుంచి ముంబై చేరుకున్నాడు. అక్కడి నుంచి విమానంలో నైరోబీకి వారంతా వెళ్లాల్సి ఉంది. అయితే వారు ప్రయాణించాల్సిన విమానం రీషెడ్యూల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ విమానయాన సంస్థ ప్రయాణికులకు హోటల్ గెలాక్సీలో బస ఏర్పాటు చేసింది.
కాగా, ఆదివారం ఆ హోటల్లో అగ్నిప్రమాదం జరిగింది. త్వరలో పెళ్లితో ఒక్కటి కావాల్సిన కిషన్, రూపల్ జంటతోపాటు 50 ఏండ్ల వ్యక్తి ఈ సంఘటనలో మరణించారు. రూపల్ తల్లి, సోదరితోపాటు మరో వ్యక్తి గాయపడ్డారు. నైరోబీ చేరుకున్న తర్వాత పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఆ జంట దురదృష్టవశాత్తూ చనిపోవడంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొన్నది. రామ్పూర్లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు బంధువులు వెల్లడించారు.