షిల్లాంగ్: మేఘాలయ రాష్ట్రంలో MDA (మేఘాలయ డెమొక్రటిక్ అలయన్స్) ప్రభుత్వం కొలువు దీరింది. ముఖ్యమంత్రిగా నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP) చీఫ్ కాన్రాడ్ సంగ్మా ప్రమాణస్వీకారం చేశారు. ఆయన మేఘాలయ సీఎంగా ప్రమాణం చేయడం ఇది వరుసగా రెండోసారి. మేఘాలయ గవర్నర్ ఫగూ చౌహాన్ సంగ్మా చేత ప్రమాణస్వీకారం చేయించారు.
సంగ్మాతోపాటుగా ప్రిస్టోన్ టైన్సాంగ్, స్నియావ్భలాంగ్ ధార్ మేఘాలయ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేశారు. ఇక ఎమ్మెల్యేలు అబు తాహెర్ మోండల్, కైర్మెన్ షిల్లా, మార్కుయిస్ ఎన్ మరాక్, రక్కమ్ ఎ సంగ్మా, అలెగ్జాండర్ లలూ హెక్, అంపరీన్ లింగ్డో, పాల్ లింగ్డో, కొమింగోన్ యంబాన్, షక్లియర్ వార్జ్రీల చేత గవర్నర్ మంత్రులుగా ప్రమాణం చేయించారు.
మొత్తం 60 స్థానాలున్న మేఘాలయలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని NPP 26 స్థానాల్లో విజయం సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. ఆ తర్వాత 11 స్థానాలతో యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (UDF) రెండో స్థానంలో ఉంది. ఈ క్రమంలో సంగ్మా UDF, HSPDP, BJP, ఇండిపెండెంట్లతో కలిసి కూటమిని ఏర్పాటు చేశారు. మొత్తం 45 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టారు.