న్యూఢిల్లీ: మోదీ సర్కార్ తప్పులో కాలేసింది! ఎరక్కపోయి ఇరుక్కుపోయింది. విపక్ష జైన్ అనుకొని స్వపక్ష జైన్పైనే కేంద్ర సంస్థలతో సోదాలు చేయించింది. విషయం తెలిశాక నాలుక్కరుచుకుని, పనిలోపనిగా విపక్ష జైన్పైనా తనిఖీలు చేయించింది. సాయం చేయాలనుకొన్నది యోగికి. కానీ చేజేతులా ఆయుధాన్ని అప్పగించింది ఎస్పీ అధినేత అఖిలేశ్యాదవ్కి. బీజేపీ డామిట్ అనుకునేలా అడ్డం తిరిగిన కథ ఏంటో చూద్దాం..
ఇద్దరూ అత్తరు వ్యాపారులే..
అనగనగా యూపీలో ఇద్దరు జైన్లు. ఇద్దరూ అత్తరు వ్యాపారులే. అందులో ఒకరు పుష్పరాజ్ జైన్. సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్సీ. సమాజ్వాదీ అత్తరు బ్రాండును మార్కెట్లో విడుదల చేసి ఆ మధ్య వార్తల్లోకెక్కారు. యూపీలో యోగి సర్కారు గ్రాఫ్ పడిపోతున్నట్టు, అఖిలేశ్ దూసుకుపోతున్నట్టు సర్వేలు వస్తుండటంతో విపక్షాన్ని ఇరకాటంలో పెట్టేందుకు తమ అమ్ములపొదిలోని ఈడీ, ఐటీ, సీబీఐ, జీఎస్టీ ఇత్యాది ఆయుధాలను బీజేపీ బయటకు తీసింది. కాకపోతే డబుల్ రోల్ సినిమాలో ఇద్దరు హీరోలను చూసి గందరగోళానికి గురయ్యే సీను ఇక్కడ రిపీట్ అయ్యింది. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. 23న పీయూష్ జైన్ అనే అత్తరు వ్యాపారి ఇంటిపై ఐటీ సోదాలు జరిగాయి. 150 కోట్ల నగదు, బంగారం కలిపి మొత్తం స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ 257 కోట్లు. డిసెంబర్ 26న పీయూష్ను అరెస్టు చేశారు. జీఎస్టీ ఎగవేత కేసు కూడా పెట్టారు. ఆ తర్వాతే కథ రసవత్తరంగా మారింది. పీయూష్కు సమాజ్వాదీతో సంబంధాలున్నాయని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. దానికి వంతపాడుతూ ప్రధాని మోదీ అవినీతి అత్తరు రాష్ట్రమంతటా చల్లుతున్నారని ఓ ఎన్నికల సభలో మాటలగారడీ చేశారు.
తేలు కుట్టిన దొంగలా..
ఈ సోదాలపై అఖిలేశ్ బాంబు పేల్చారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు పట్టుకున్నది బీజేపీ వాడైన పీయూష్ జైన్ అని, సమాజ్వాదీ పుష్పరాజ్ జైన్ అనుకుని సోదాలు చేశారని చురకలేశారు. కాల్ రికార్డును బయటపెట్టారు. ఢిల్లీ పెద్దలు ఒక జైన్ దగ్గరికి వెళ్లమంటే కేంద్ర సంస్థలు మరో జైన్ దగ్గరకు వెళ్లారని ఎద్దేవా చేశారు. సోదాలపై విమర్శలు, మనోడిపైనే వేటు వేశామనే అపరాధ భావన కలగలిసి బీజేపీని మూలకు నెట్టేశాయి. తేలు కుట్టిన దొంగలా తయారైంది పరిస్థితి. ఆ తప్పును కప్పి పుచ్చుకునేందుకు ఇప్పుడు ఎస్పీ పుష్పరాజ్ జైన్పై కూడా సోదాలు చేయించిందని విమర్శలు సంధిస్తున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తున్నదని, దీనిపై రాష్ట్రపతి, ఈసీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
ఆ సొమ్ము మాదికాదు: నిర్మల
అఖిలేశ్ ధాటికి చివరకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రంగంలోకి సోదాలను సమర్థించుకున్నారు. ఆ సొమ్ము బీజేపీది కాదని, ఒకరనుకొని మరొకరి మీద సోదాలు జరిపామనడం సరికాదని సమర్థించుకున్నారు. అది ఏ పార్టీ సొమ్మో అఖిలేశ్కు ఎలా తెలుసని ప్రశ్నించారు. బహుశా తనకు ఆ వ్యాపారి భాగస్వామి అవుతాడేమోనని చెప్పుకొచ్చారు. బీజేపీ సర్కార్ ఇంతగా వివరణలు ఇచ్చుకోవాల్సి రావడమే అఖిలేశ్ తన విజయంగా భావిస్తున్నారు.