Supreme Court | న్యూఢిల్లీ, నవంబర్ 20: రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను ఆమోదించకుండా తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి మూడేండ్లు ఏం చేశారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఎందుకు పెండింగ్లో పెట్టారని నిలదీసింది. సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిన తరువాతనే గవర్నర్ స్పందించారని, 12లో 10 బిల్లులను వెనక్కి పంపారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం పేర్కొంది. 2020 జనవరిలో ఆమోదించిన బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్నాయని తెలిపింది. అంటే సుప్రీంకోర్టు నోటీసు ఇచ్చిన తరువాతనే గవర్నర్ నిర్ణయం తీసుకున్నారని, ఈ మూడేండ్లు ఆయన ఏం చేస్తున్నారని ప్రశ్నించింది.
రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానాన్ని ఆశ్రయించేంత వరకు గవర్నర్ ఎందుకు వేచి చూడాల్సి వచ్చిందని నిలదీసింది. గవర్నర్ రవి నవంబర్ 2021లో బాధ్యతలు చేపట్టారని, అంతుకుముందు నుంచే బిల్లులు పెండింగ్లో ఉన్నాయని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై సీజేఐ చంద్రచూడ్ స్పందిస్తూ.. ‘ఏ గవర్నర్ వల్ల బిల్లులు పెండింగ్లో పడ్డాయన్నది కాదు ప్రశ్న. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 కింద లభించిన అధికారాలను వినియోగించడంలో గవర్నర్లు ఎందుకు జాప్యం చేశారన్నదే ప్రశ్న’ అని వ్యాఖ్యానించారు. బిల్లులను అటు వెనక్కి తిప్పి పంపకుండా లేదా ఇటు రాష్ట్రపతికి పంపకుండా తన వద్దనే తొక్కి పెట్టవచ్చా? అని నిలదీశారు.
గవర్నర్ తిప్పి పంపిన 10 బిల్లులను తమిళనాడు అసెంబ్లీ ఈ నెల 18న ఎటువంటి మార్పులు చేయకుండానే మళ్లీ ఆమోదించి పునఃపరిశీలనకు గవర్నర్కు పంపిందని తమిళనాడు ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ బిల్లులపై గవర్నర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దామని ఈ కేసు తదుపరి విచారణను సుప్రీంకోర్టు డిసెంబర్ ఒకటో తేదీకి వాయిదా వేసింది. ఆర్టికల్ 200 ప్రకారం రాష్ట్ర అసెంబ్లీ ఏదైనా బిల్లును సవరణలు చేసి లేదా చేయకుండా రెండోసారి ఆమోదించి గవర్నర్కు పంపితే.. తప్పనిసరిగా ఆమోదించాల్సి ఉంటుంది. ప్రజలు చట్టబద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వానికి రాష్ట్ర గవర్నర్ ఓ రాజకీయ ప్రత్యర్థి లాగా అడ్డు పడుతున్నారని ఆరోపిస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ నెల 10 కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేస్తూ.. గవర్నర్ తీరుపై తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది.
శాసనసభ ఆమోదించిన బిల్లులకు తన సమ్మతిని తెలియజేయకుండా గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ పెండింగ్లో పెట్టారని ఆరోపిస్తూ కేరళ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు స్పందించింది. ఈ పిటిషన్కు సమాధానం ఇవ్వాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి, కేరళ గవర్నర్ కార్యాలయానికి నోటీసులు జారీచేసింది. గవర్నర్ వద్ద ఎనిమిది బిల్లులు ఏడు నుంచి 20 నెలలుగా పెండింగ్లో ఉన్నాయని కేరళ ప్రభుత్వం తరఫు న్యాయవాది కేకే వేణుగోపాల్ తెలిపారు. గవర్నర్ తీరు ప్రజల హక్కులకు విఘాతం కలిగించేదిగా ఉన్నదని పేర్కొన్నారు.