న్యూఢిల్లీ: పలువురిని మోసగించడంతోపాటు రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో అరెస్టై ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్న సుకేష్ చంద్రశేఖర్, ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్పై పలు ఆరోపణలు చేశాడు. తనకు రాజ్యసభ సీటు ఇస్తానని చెప్పి రూ.50 కోట్లు ఆప్ వసూలు చేసిదంటూ బహిరంగ లేఖ విడుదల చేశాడు. తాను మోసగాడైతే, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మహా మోసగాడని అందులో ఆరోపించాడు.
అలాగే సుకేష్ ఇటీవల ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు లేఖ రాశాడు. ప్రస్తుతం జైల్లో ఉన్న ఆప్ మంత్రి సత్యేంద్ర జైన్తో తనకు 2015 నుంచి పరిచయం ఉందని తెలిపాడు. దక్షిణాదిలో ఆప్ రాజ్యసభ సీటు కోసం ఆ పార్టీకి రూ.50 కోట్లు ఇచ్చినట్లు చెప్పాడు. 2017లో తాను అరెస్టైనప్పుడు, జైళ్ల శాఖ మంత్రిగా ఉన్న సత్యేంద్ర జైన్ పలుమార్లు తీహార్ జైలుకు వచ్చి తనను కలిసినట్లు తెలిపాడు. తన రక్షణ కోసం నెలకు రూ.2 కోట్లు ఇవ్వాలని ఆయన కార్యదర్శి డిమాండ్ చేసినట్లు అందులో పేర్కొన్నాడు.
అనంతరం 2019లో కూడా సత్యేంద్ర జైన్, ఆయన కార్యదర్శి, జైల్లో ఉన్న ఆయన స్నేహితుడు సుషీల్ కలిసి ప్రతి నెలా రూ.2 కోట్లు ఇవ్వాలని తనను బెదిరించినట్లు ఆ లేఖలో సుకేష్ ఆరోపించాడు. జైలులో తనకు రక్షణ, సౌకర్యాల కోసం డబ్బులు డిమాండ్ చేసినట్లు తెలిపాడు. అలాగే నాటి జైళ్ల డీజీ సందీప్ గోయల్కు కూడా ప్రతి నెలా రూ.1.5 కోట్లు ఇవ్వాలని చెప్పారన్నారు.
డబ్బుల కోసం తనను ఒత్తిడి చేయడంతో కోల్కతాలోని తన అనుచరుడు చతుర్వేది ద్వారా సత్యేంద్ర జైన్కు రూ.10 కోట్లు, జైళ్ల డీజీ సందీప్ గోయల్కు రూ.12.5 కోట్లు ఇచ్చినట్లు ఆ లేఖలో సుకేష్ ఆరోపించాడు. ఈ విషయం బయటపెట్టడంతో తనను చంపుతానని ఆప్ నేతలు, సందీప్ గోయల్ బెదిరిస్తున్నారని పేర్కొన్నాడు. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు కోరుతానని, తనను ఎవరూ అడ్డుకోలేరంటూ తాజా లేఖలో సుకేష్ హెచ్చరించాడు.