Hema Malini | ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయంపై ఆ పార్టీ ఎంపీ-బాలీవుడ్ కథానాయిక హేమమాలిని సంచలన వ్యాఖ్యలు చేశారు. బుల్డోజర్ ముందు నిలబడేందుకు ఏ ఒక్కరూ రాలేరని వ్యాఖ్యానించారు. యూపీలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 202 సీట్లు సాధించిన తర్వాత ఆమె పై విధంగా స్పందించారు. భూములు, ఆస్తులు అక్రమంగా, చట్ట విరుద్ధంగా ఆక్రమించుకున్న వారిని తొలగించేందుకు యోగి సర్కార్ బుల్డోజర్లను ఉపయోగించిన నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో ఈ పదం ఎక్కువ ప్రాచుర్యం పొందింది.
ఉత్తరప్రదేశ్లో ప్రతి రంగం అభివృద్ధికి బీజేపీ కార్యకర్తలు పని చేశారని హేమమాలిని అన్నారు. ప్రజల విశ్వాసం ఉన్నందు వల్లే తాము అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినందువల్లే తమ పార్టీ మళ్లీ ప్రభుత్వాన్నిఏర్పాటు చేస్తుందని తెలుసునన్నారు. బుల్డోజర్ ముందుకు ఎవరైనా వస్తే ఒక్క నిమిషంలో వారి సంగతి తేల్చేస్తాం. సైకిలైనా.. మరేదైనా అని చెప్పారు.
యూపీలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీని బీజేపీ సాధించిన వార్తలు రావడంతో లక్నోలోని ఆ పార్టీ కార్యాలయంలో సంబురాలు మిన్నంటాయి. పార్టీ కార్యకర్తలు బీజేపీ జెండాలు పట్టుకుని రంగులు పూసుకున్నారు.