Narayana Kurup : ప్రముఖ మలయాళ కవి, సాహితీ విమర్శకులు, పద్మశ్రీ (Padmasri) పురస్కార గ్రహీత, 92 ఏళ్ల పీ నారాయణ కురుప్ (Narayana Kurup) కన్నుమూశారు. తిరువనంతపురం (Thiruvanantapuram) లోని పెరూర్కడలో తన నివాసంలో ఆయన అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల మలయాళ సాహితీ లోకం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. 1934 సెప్టెంబర్ 5న అప్పటి ట్రావెన్కోర్ సంస్థానంలోని హరిపాడులో జన్మించిన నారాయణ కురుప్, కవిగా, విమర్శకుడిగా మలయాళ సాహిత్యంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.
నాలుగు దశాబ్దాలకుపైగా సాహితీ సేవ చేసిన ఆయన సంప్రదాయ, ఆధునిక సాహిత్య ప్రక్రియలపై చెరగని ముద్రవేశారు. కేవలం రచయితగానే కాకుండా కథాకళి, కూడియాట్టం వంటి శాస్త్రీయ కళల విమర్శకుడిగా, ప్రోత్సాహకుడిగా ఆయన విశేష ఖ్యాతి గడించారు. తపస్య, మార్గి వంటి పలు ప్రతిష్ఠాత్మక కళా, సాహిత్య సంస్థలకు అధ్యక్షుడిగా కూడా ఆయన సేవలందించారు. ఆయన సాహిత్య కృషికి గుర్తింపుగా అనేక ఉన్నత పురస్కారాలు లభించాయి. 1991లో కేరళ సాహిత్య అకాడమీ అవార్డు, 2014లో వల్లథోల్ అవార్డు వంటి గౌరవాలు ఆయనను వరించాయి.
భారత ప్రభుత్వం 2022లో ఆయనను దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారమైన ‘పద్మశ్రీ’ తో సత్కరించింది. కురుప్ మరణవార్త తెలియగానే సాహిత్య, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. తిరువనంతపురంలోని థైకాడ్ శాంతికవాడం శ్మశానవాటికలో కుటుంబసభ్యుల సమక్షంలో ఆయన అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించారు.