న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి అక్టోబర్ 17న ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో గాంధీల కుటుంబం నుంచి ఎవరూ పోటీపడటం లేదని ఆ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవికి పోటీపడబోతున్నారంటూ పలువురు సీనియర్ నేతల పేర్లు చర్చకు వస్తున్నాయి.
ఇదే వరుసలో పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ పేరు కూడా వెలుగులోకి వచ్చింది. దీనిపై ఇవాళ దిగ్విజయ్సింగ్ స్పందించారు. జబల్పూర్లో జరిగిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన ఆయన.. తాను పార్టీ అధ్యక్ష పదవి రేసులో లేనని స్పష్టంచేశారు. అయితే పార్టీలోని ఉన్నతస్థాయి నేతలు ఇచ్చే ఆదేశాలు, సూత్రాలను తాను తూచా తప్పకుండా పాటిస్తానని ఆయన చెప్పారు.
దిగ్విజయ్సింగ్ క్లారిటీతో ప్రస్తుతానికి అధ్యక్ష పదవి రేసులో ఇద్దరి పేర్లు మాత్రమే ఎక్కువగా వినిపిస్తున్నాయి. వారిలో ఒకరు సీనియర్ నాయకుడు, ఎంపీ శశీ థరూర్ కాగా, మరొకరు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్. కాగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి అక్టోబర్ 17న ఎన్నికలు జరుగనున్నాయి. అక్టోబర్ 19న ఫలితాలు వెల్లడికానున్నాయి. సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు నామినేషన్లకు గడువు విధించారు.