Shivsena Crisis | మహారాష్ట్రలోని అధికార మహా వికాస్ కూటమిలోనే కాదు.. దానికి సారధ్యం వహిస్తున్న శివసేన పార్టీ నిట్ట నిలువున చీలే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏక్నాథ్ షిండే సారధ్యంలో తిరుగుబాటు చేసిన 40 మంది శివసేన ఎమ్మెల్యేలతోపాటు.. ఆయన బాటలోనే శివసేన ఎంపీలు పయనిస్తున్నట్లు సమాచారం.
ఠాణె ఎంపీ రాజన్ విచారే, వాషిమ్ లోక్సభ సభ్యుడు భావ్నా గావ్లీ, రాంటెక్ ఎంపీ కృపాల్ తుమానే, కల్యాణ్ ఎంపీ శ్రీకాంత్ షిండే పాల్ఘడ్ ఎంపీ రాజేంద్ర గావిత్ తదితరులు ఏక్నాథ్ షిండే పక్షానికి మారిపోయినట్లు తెలుస్తున్నది. ఇప్పటికే రాజన్ విచారే, శ్రీకాంత్ షిండే.. ఏక్నాథ్ షిండేతోపాటు గువాహటిలో ఉన్నట్లు సమాచారం.
కానీ కృపాల్ తుమానే మాత్రం తాను ఏక్నాథ్ షిండేతో చేతులు కలిపినట్లు వచ్చిన వార్తలను తోసిపుచ్చారు. ఇది సహనం వహించాల్సిన సమయం అని వ్యాఖ్యానించారు. తాను ఇంకా శివసేనలోనే ఉన్నట్లు చెప్పారు. ఏ ఒక్కరూ తనను సంప్రదించలేదన్నారు. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తలు పూర్తిగా అబద్దం అని మీడియాకు తెలిపారు.