యూపీఏ చైర్మన్ బాధ్యతలపై తనకు ఎలాంటి ఆసక్తీ లేదని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ పునరుద్ఘాటించారు. అలాగే బీజేపీయేతర కూటమికి కూడా నాయకత్వం వహించడంపై ఆసక్తి లేదన్నారు. కొల్హాపూర్లో జరిగిన విలేకరుల సమావేశంలో పవార్ మాట్లాడారు. కేంద్రంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ఎదగదని తాను అనడం లేదని వివరణ ఇచ్చారు. అయితే… తనకు యూపీఏ చైర్పర్సన్తో సహా.. మరే ఇతర పోస్ట్పై ఆసక్తి లేదని తెలిపారు.
తాను ఏ పదవుల వెనకా పడదలుచుకోలేదని, ఏ బాధ్యతలూ తలకెత్తుకోనని పవార్ స్పష్టం చేశారు. అయితే… దేశ వ్యాప్తంగా.. బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎవరైనా ముందుకు వస్తే మాత్రం.. వారికి అన్ని విధాలా సహకరించేందుకు సిద్ధంగానే వున్నానని హామీ ఇచ్చారు. అయితే.. బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు కాంగ్రెస్కు అవకాశాలున్నాయని, అయితే అంత ప్రాచీనమైన పార్టీ ప్రస్తుతం అధికారంలో లేదని ఆయన పేర్కొన్నారు.
దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రో, గ్యాస్ ధరలు పెరిగిపోయాయమని, ఇదో పెద్ద సమస్యగా మారిందని పవార్ అన్నారు. రోజురోజుకీ బీజేపీ పాలనలో పెట్రో ధరలు పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. దీని వల్ల సామాన్యులకు విపరీతమైన ఆర్థిక భారం పడుతోందని పవార్ ఆవేదన వ్యక్తం చేశారు.