Madras High Court | మదురై, జనవరి 31: దేవాలయాల్లోకి హిందూయేతర వ్యక్తుల ప్రవేశంపై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అన్ని ఆలయాల్లో హిందూయేతర మతాలకు చెందిన వ్యక్తులను ఆలయ ప్రవేశాల వద్ద ఉండే ధ్వజ స్తంభం దాటి అనుమతించొద్దని, ఈ విషయాన్ని తెలుపుతూ ఆలయ ప్రాంగణంలో బోర్డులు ఏర్పాటు చేయాలని తమిళనాడు దేవాదాయ శాఖను మంగళవారం ఆదేశించింది. ఆలయాలు ‘పిక్నిక్ స్పాట్’ కాదని వ్యాఖ్యానించిన న్యాయస్థానం.. హిందువులకు తమ మతాన్ని విశ్వసించే, ఆచరించే ప్రాథమిక హక్కు ఉన్నదని, అందుకు భంగం వాటిల్లకూడదని మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ స్పష్టం చేసింది.
డీ సెంథిల్ కుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ శ్రీమతి ఈ మేరకు తీర్పునిచ్చారు. అరుల్మిగు పళని దండాయుతపాణి స్వామి ఆలయం, దాని ఉప ఆలయాల్లో హిందువులను మాత్రమే ప్రవేశాన్ని అనుమతించేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని కోరుతూ సెంథిల్ ఈ పిటిషన్ వేశారు. ఆ మేరకు ఆలయాల వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని కూడా ఆయన కోరారు.
పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం.. హిందూ మతం పట్ల విశ్వాసం లేని వారిని ఆలయాల్లోకి అనుమతించొద్దని ఆదేశించింది. ఒకవేళ ఎవరైనా హిందూయేతర వ్యక్తి వస్తే అధికారులు తనకు సదరు దేవతామూర్తి పట్ల విశ్వాసం ఉన్నదని, హిందూ మత, ఆలయ పద్ధతులను పాటిస్తానని పేర్కొంటూ అండర్టేకింగ్ తీసుకోవాలని పేర్కొన్నది. దీనిపై అధికారులు కూడా రిజిస్టర్ నిర్వహించాలని సూచించింది.